Congress President: కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఖర్గే, థరూర్.. కేఎన్.త్రిపాఠి నామినేషన్ తిరస్కరణ
కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పోటీ పడుతున్నారు. శనివారంతో అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. ఈ నెల 8 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ నెల 17న ఎన్నిక జరుగుతుంది.
- Narender Thiru
- Published On : October 1, 2022 / 05:25 PM IST
Congress President: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. పోటీలో పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ మాత్రమే మిగిలారని కాంగ్రెస్ నేత, ఎన్నికల అధికారిగా ఉన్న మధుసూధన్ మిస్త్రీ ప్రకటించారు.
దీంతో ఇద్దరు సీనియర్ నేతల మధ్య అధ్యక్ష పదవికి పోటీ జరిగే అవకాశం ఉంది. మరోవైపు రేసులో ఉంటాడని భావించిన ఝార్ఖండ్ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన వివరాల్ని ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈ పోటీకి మొత్తం 20 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సంతకం సరిపోలకపోవడంతో నాలుగు అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కేఎన్ త్రిపాఠి దరఖాస్తు కూడా సంతకం మ్యాచ్ కాకపోవడంతోనే తిరస్కరణకు గురైంది. దీంతో ప్రస్తుతం పోటీలో శశిథరూర్, మల్లికార్జున ఖర్గే మాత్రమే మిగిలారు. వీరిలో సోనియా, రాహుల్ మద్దతు మల్లికార్జున ఖర్గేకు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Cheetahs In India: ఏడు దశాబ్దాల తర్వాత దేశంలో జన్మించబోతున్న చీతా.. ‘ఆశా’ గర్భిణి అంటున్న అధికారులు
నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 8 వరకు గడువుంది. ఆ లోపు ఇద్దరిలో ఎవరైనా నామినేషన్ ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. లేదంటే ఇద్దరి మధ్యా పోటీ జరుగుతుంది. ఈ నెల 17న ఎన్నిక జరగాల్సి ఉంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష ఎన్నిక జరుగుతుండటం విశేషం. ఈ సారి ఎలాగైనా కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్కు ఈ ఎన్నిక కూడా కీలకమైంది.
