Seema and Sachin: భారత్లో ఎంటర్ అయ్యేందుకు సీమా హైదర్ పెద్ద స్కెచ్చే వేసిందిగా.. వెలుగులోకి వస్తున్న షాకింగ్ కోణాలు
పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ(ISI)తో సీమా హైదర్కు సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో ఆమెపై ఏటీఎస్, ఐబీ నిఘా వేశాయి. ఆమె ఇండియాలో ప్రవేశించిన అనంతరమే.. ఆమెతో సహా ప్రియుడు సచిన్, అతడి తండ్రి నేత్రపాల్ను విదేశీయుల చట్టం కింద యూపీ పోలీసులు అరెస్టు చేశారు.

Seema and Sachin: పబ్జీ పరిచయం ప్రేమగా మారి భారతీయ ప్రియుడి కోసం పాకిస్తాన్ వదిలేసి అక్రమంగా భారతదేశంలో అడుగుపెట్టిన సీమా గులాం హైదర్ రోజు రోజుకూ కొత్త కోణాలు బయట పడుతున్నాయి. తాజాగా ఆమె భారత్లోకి రావడానికి ముందుగానే పెద్ద ప్లాన్ వేసిందట. భారత్లోకి రావడానికి ముందే మేకప్పై దృష్టిపెట్టిందని ఇంటలీజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అచ్చం భారతీయ మహిళ మాదిరిగా కనిపించేలా మేకప్ కోసం ప్రొఫెషనల్స్ సాయం కోరినట్టు సమాచారం.
INDIA: కులతత్వ పార్టీలతో కాంగ్రెస్ కూటమి.. ఇండియా కూటమిపై బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన వ్యాఖ్యలు
భారతీయ మహిళగా కనిపించేలా చాలా జాగ్రత్త వహించిందట. ఆమెనే కాందు, తన పిల్లల విషయంలో కూడా ఇదే జాగ్రత్త తీసుకొందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. సెక్యూరిటీ ఏజెన్సీలు గుర్తించకుండా సీమా హైదర్ ఈ విధమైన పక్కా ప్రణాళిక ఎంచుకుందట. మామూలుగా అయితే ఇలాంటి తరహా విధానాలను మానవ అక్రమ రవాణా చేసేవాళ్లు ఉపయోగిస్తుంటారని ఇంటలీజెన్స్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఇంటి పనుల కోసం, వ్యభిచార కూపంలోకి దింపేందుకు వేషధారణ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని, అలా మార్చేసి ఇండో-నేపాల్ బోర్డర్ దాటిస్తుంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
ఇక సీమా హైదర్ విషయానికి వస్తే.. ఒక వేషధారణే కాదు, భాషనైపుణ్యాలు కూడా బాగానే అవపోసన పట్టిందట. భారతీయ యాసలో అనర్గళంగా మాట్లాడుతోందని రిపోర్టులు చెబుతున్నాయి. నేపాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న పాకిస్తానీ నిర్వహకులు ఆమెకు శిక్షణ ఇచ్చి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారికి ఇలాంటి శిక్షణ ఇచ్చి నేపాల్ బోర్డర్ దాటిస్తుంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు వివరించాయి.
పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో సీమా హైదర్కు సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో ఆమెపై ఏటీఎస్, ఐబీ నిఘా వేశాయి. ఆమె ఇండియాలో ప్రవేశించిన అనంతరమే.. ఆమెతో సహా ప్రియుడు సచిన్, అతడి తండ్రి నేత్రపాల్ను విదేశీయుల చట్టం కింద యూపీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురూ బెయిల్పై విడుదలయ్యారు. కాగా, తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ సరిహద్దు దాటిన సీమా.. 22 ఏళ్ల సచిన్ మీనా అనే తన ప్రియుడి కోసం భారత్ వచ్చానని ఆమె చెబుతోంది.