నమాజ్ కోసం ముస్లింలు పక్క ఊరికి వెళ్లాల్సి వస్తోందని.. సిక్కు మహిళ, హిందువులు ఎంత గొప్పపని చేశారంటే?
ముస్లింలకు ప్రార్థనాస్థలం ఉండాలనే ఉద్దేశంతో సిక్కు మహిళ దాదాపు 1,360 చదరపు అడుగుల భూమిని ఇచ్చేశారు.
Punjab: మత సామరస్యం వెల్లివిరిసింది. అసలైన భారత్ ఎలా అంటే ఎలా ఉంటుందో ఆ గ్రామ ప్రజలు చూపారు. పంజాబ్ ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలో ఓ సిక్కు మహిళ (75) మసీదు నిర్మాణం కోసం భూమిని దానం చేశారు. అంతేగాక, మరికొన్ని సిక్కు, హిందూ కుటుంబాలు నగదు సాయం అందించాయి.
జాఖ్వాలి గ్రామంలో సిక్కు కుటుంబాలు అధికంగా నివసిస్తుంటాయి. మొత్తం 400-500 సిక్కు కుటుంబాలు ఉన్నాయి. హిందూ కుటుంబాలు 150, ముస్లిం కుటుంబాలు 100 ఉన్నాయి. చండీగఢ్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో గురుద్వారా, శివాలయం ఉన్నాయి. ఇప్పటివరకు మసీదు మాత్రం లేదు.
“ఇక్కడ మా ముస్లిం స్నేహితులకు మసీదు లేదు. వాళ్లు నమాజ్ కోసం పక్క గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది. వారికి ప్రార్థనాస్థలం ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 1,360 చదరపు అడుగుల భూమిని ఇచ్చాను. వాళ్లు సంతోషంగా ఉంటే మాకూ ఆనందమే” అని భూమిని దానం చేసిన బీబీ రాజిందర్ కౌర్ తెలిపారు.
ఆమె మనవడు సత్నామ్ సింగ్ మాట్లాడుతూ గ్రామంలో సిక్కు, ముస్లిం, హిందూ కుటుంబాలు తరతరాలుగా సోదరుల్లా జీవిస్తున్నాయని చెప్పారు. ఏ మత కార్యక్రమం జరిగినా అందరూ సహకారం అందిస్తారని, పాల్గొంటారని అన్నారు. మసీదు నిర్మాణ అంశం పంచాయతీ స్థాయిలో పరిష్కారం రాలేదని తెలిపారు. దీంతో బీబీ రాజిందర్ కౌర్ స్వచ్ఛందంగా మసీదు కోసం భూమిని ఇచ్చారని చెప్పారు.
Also Read: బంగారం కొంటున్నారా? హైదరాబాద్, విజయవాడలో ధరలు ఎలా ఉన్నాయంటే?
భూమి బీబీ రాజిందర్ కౌర్ పేరు నుంచి మసీదు కమిటీ పేరు మీద బదిలీ చేస్తూ రిజిస్ట్రేషన్ చేశారు. సత్నామ్ సోదరుడు మోను సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి మత నిర్మాణాలకు కేటాయించడం సాధ్యం కాదని చెప్పారు. అందుకే కుటుంబ భూమిని దానం చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. “మతభేదాలు లేకుండా మొత్తం గ్రామం మసీదు నిర్మాణానికి సహకారం అందిస్తోంది” అన్నారు.
మాజీ సర్పంచ్, స్థానిక బీజేపీ నాయకుడు అజైబ్ సింగ్ మాట్లాడుతూ.. హిందూ ఆలయ నిర్మాణ సమయంలో ముస్లింలు, సిక్కులు సహకారం ఇచ్చారని గుర్తు చేశారు. అదే విధంగా గురుద్వారా నిర్మాణానికి అన్ని వర్గాలు మద్దతిచ్చాయని చెప్పారు.
బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన గుర్సేవక్ కుమార్ మాట్లాడుతూ.. తమ గ్రామ ఐక్యత తమకు గర్వకారణమని చెప్పారు. మసీదు కమిటీ అధ్యక్షుడు కలా ఖాన్ మాట్లాడుతూ.. గ్రామస్తుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. “అన్ని సమాజాల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారు. ఫిబ్రవరి నాటికి మసీదు నిర్మాణం పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం” అన్నారు. ఇప్పటివరకు రూ.3.5 లక్షలు సేకరించారు.
పంజాబ్ షాహీ ఇమామ్ మౌలానా ఉస్మాన్ లుధియాన్వీ మసీదుకి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఇలాంటి సామరస్య పనులతో పంజాబ్ చాలా కాలంగా ప్రసిద్ధి చెందిందని చెప్పారు.
