Ashish Sharma
Ashish Sharma: గత ఏడాది కరోనా కారణంగా చాలా మంది సినీ సెలబ్రిటీలు.. నగరాలకు దూరంగా ఫామ్ హౌస్ లకు చేరుకొని వ్యవసాయంతో పాటు వారి సొంత పనులను తామే చేస్తుకున్న సంగతి చాలానే చూశాం. కానీ సెకండ్ వేవ్ సమయంలో మాత్రం యధావిధిగా మళ్ళీ నగరాలలోనే ఉండిపోయారు. అయితే.. ఓ బాలీవుడ్ నటుడు మాత్రం ఏకంగా తన స్వస్థలానికి చేరుకొని అక్కడే వ్యవసాయం చేసుకుంటూ గడుపుతున్నాడు. అతనే ఆశిష్ శర్మ.
‘సియా కే రామ్’ సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఆశిష్.. ప్రధాని నరేంద్ర మోదీ జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘మోదీ: జర్నీ ఆఫ్ కామన్ మ్యాన్’ వెబ్సిరీస్లో మోదీ యవ్వన దశ పాత్రలో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు. కరోనా లాక్ డౌన్ తో స్వస్థలం రాజస్తాన్కు చేరుకున్న ఆశిష్.. ప్రస్తుతం రైతుగా మారి స్వస్థలంలోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. అంతేకాదు.. ఆవులను మేపడం.. పాలు పితకడం కూడా చేస్తున్నాడు.
స్వస్థలంలో తనకు 40 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఆవులు కూడా ఉన్నాయని.. ఇప్పుడు వాటితోనే నా జీవితమని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నాడు. నగరంలో ఉంటూ జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం మనం ఎప్పుడో మర్చిపోయామని చెప్తున్న ఆశిష్.. నిజానికి కోవిడ్ మూలంగానే మన జీవితంలో అతి ముఖ్యమైనవి ఏమిటో తెలిసివచ్చిందని అందుకే తిరిగి వచ్చేశానని చెప్పాడు.
ఇక జైపూర్లోని తమ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఆశిష్ ఇకపై ప్రకృతితో కలిసి బ్రతికేందుకే ఇష్టపడుతున్నానని చెప్పాడు. 2013లో నటి అర్చన తడేను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆశిష్.. లవ్ సెక్స్ ఔర్ ధోఖా, జిందగీ తేరేనామ్ వంటి సినిమాలతో పాటు రంగ్రసియా సీరియల్తో బుల్లితెరపై స్టార్గా గుర్తింపు పొందగా.. ప్రస్తుతం అతడు నటించిన.. కరణ్ రాజ్దాన్ ‘హిందుత్వ’ విడుదలకు సిద్ధంగా ఉంది.