హస్తినకు కాంగ్రెస్ నేతలు : ఏపీలో టీడీపీ పొత్తుపై రాని స్పష్టత

టీడీపీతో పొత్తును కోరుతున్న కాంగ్రెస్ సీనియర్లు
టీడీపీతో పొత్తును వద్దంటున్న ద్వితీయశ్రేణి నాయకత్వం
పొత్తులో పోటీచేసే స్థానాలు తగ్గుతాయంటున్న సెకండరీ కేడర్
తమకు పోటీచేసే అవకాశం పోతుందని మొర
విజయవాడ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజకీయాలు వేడెక్కనున్నాయా? కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై కొన్ని రోజులుగా నెలకొన్న స్తబ్ధత వీడనుందా? 2019, జనవరి 3వ తేదీన హస్తినకు వెళ్తున్న ఏపీ నేతలు టీడీపీతో పొత్తు కావాలని కోరుకుంటారా? లేక వద్దని అధిష్టానంతో చెబుతారా ?
ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ ?
2014లో జరిగిన ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్..మళ్లీ గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల్లో పూర్వ వైభవం సాధించే దిశగా కార్యచరణను రూపొందిస్తోంది హై కమాండ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్..టీడీపీ జత కలిసిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా పొత్తు పెట్టుకుందామా ? లేక ఒంటరిగానే వెళ్లాలా ? అనే దానిపై కాంగ్రెస్ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఏపీలోనూ అదే పొత్తు కొనసాగుతుందన్న ఆశలో కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అయితే ఏపీ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై తమ అభిప్రాయాలు చెప్పాలని అధిష్టానం కోరింది. దీంతో కాంగ్రెస్ నేతలు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరుతున్నారు.
పొత్తు నష్టమంటున్న నేతలు…
టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టమే జరుగుతుందని కొంతమంది వాదిస్తున్నారు. పొత్తులో భాగంగా ఆ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించే పరిస్థితి ఉత్నన్నమౌతుందని..ఇన్నాళ్లు తాము పార్టీ కోసం కష్టపడినదంతా వృదా అవుతుందని నేతలు రఘువీరా వద్ద మొర పెట్టుకుంటున్నారు. ఇక హస్తినకు వెళ్లనున్న ఏపీ కాంగ్రెస్ పెద్దలు..ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్తో పొత్తులు..ఇతర అంశాలపై చర్చించనున్నారు. టీడీపీతో పొత్తుపెట్టుకుంటేనే ఏపీలో కాంగ్రెస్కు పూర్వవైభవం వస్తుందన్నది రాహుల్ దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. హస్తినలోని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి ఆ తర్వాత పొత్తుపై నిర్ణయం తీసుకోనుంది.