India Covid Cases: బాబోయ్.. భారత్లో మళ్లీ కరోనా కలకలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే..
గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తాము అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్రం చెప్పింది.

India Covid Cases: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి.. మానవాళిని వెంటాడుతోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపాల్లో విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఆసియాలోని పలు దేశాల్లో కరోనా కల్లోలం రేగింది. తాజాగా భారత్ లోనూ మళ్లీ కోవిడ్ మొదలైంది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.
అయితే పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఉన్న కేసులన్నీ స్వల్ప తీవ్రతతోనే ఉన్నాయని వెల్లడించింది. కాగా, గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తాము అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్రం చెప్పింది.
కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం మే 12 నుంచి వారం రోజుల్లో 164 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూశాయి. గత వారం కేరళలో 69 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం 56 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR) విభాగం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
Also Read: ఆసియాలో మళ్లీ కోవిడ్ కలకలం.. టెన్షన్ పెడుతున్న JN.1 వేరియంట్.. లక్షణాలు ఏవి, ముందు జాగ్రత్తలు ఏంటి..
అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం, కేసులు చాలావరకు తేలికపాటివి, అసాధారణ తీవ్రత లేదా మరణాలతో సంబంధం కలిగి లేవని ఓ అధికారి తెలిపారు. దేశంలోని జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. ఈ కేసులన్నీ దాదాపు తేలికపాటివి అని, బాధితులెరూ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని వివరించారు.
ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), ICMR ద్వారా COVID-19 తో సహా శ్వాసకోశ వైరల్ వ్యాధుల నిఘా కోసం బలమైన వ్యవస్థ ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ”కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటోంది. అప్రమత్తంగా, చురుగ్గా వ్యవహరిస్తోంది” అని అధికార వర్గాలు పేర్కొన్నాయి.