Road Accident in Uttar Pradesh
Uttar Pradesh Road Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్ కచ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కా స్టాప్ సమీపంలో గురువారం అర్ధరాత్రి 1గంట సమయంలో ట్రాక్టర్ ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10మంది మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బనారస్ హిందూ యూనివర్సిటీ ట్రామా సెంటర్ కు తరలించారు. ప్రమాదం సమయంలో ట్రాక్టర్ పై మొత్తం 13 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరంతా రోజువారి కూలీలు. భదోహ జిల్లాలోని తివారీ గ్రామం నుంచి పని పూర్తి చేసుకొని ట్రాక్టర్ పై కూలీలు వారణాసి వైపు వెళ్తున్నారు.
Also Read : Prince : ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎంతో కాలం బాధించింది.. ‘కలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రిన్స్..
కచ్వా సరిహద్దు జిట్ రోడ్ లో వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ లోని పది మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 13 మందికూడా రోజువారీ కూలీలు. వీరి మృతితో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది.