Water Taxis : వచ్చే నెల నుంచే..ముంబైలో వాటర్ ట్యాక్సీలు
మరికొద్ది రోజుల్లోనే ముంబైలో సరికొత్త రవాణా విధానం అందుబాటులోకి రానుంది. నూతన సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికేందుకు ముంబై సిద్ధమైంది.

Water Taxi
Water Taxis : మరికొద్ది రోజుల్లోనే ముంబైలో సరికొత్త రవాణా విధానం అందుబాటులోకి రానుంది. నూతన సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికేందుకు ముంబై సిద్ధమైంది. ముంబై సిటీలో ప్రధాన వాణిజ్య జిల్లా అయిన నవీ ముంబై నుంచి దక్షిణ ముంబైకి అధికసంఖ్యలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో…నవీ ముంబై-దక్షిణ ముంబై మధ్య అవాంతరాలు లేని జల రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.
జనవరి 2022 నుంచే ముంబైలో వాటర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి ఎలిఫెంటా వరకు, డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి రేవాస్, ధరంతర్, కరంజాదే వరకు… డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి బేలాపూర్, నేరుల్, అయిరోలి, వాషి, ఖందేరీ ఐలాండ్స్, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ మార్గాల్లోనూ వాటర్ టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో రూట్లో గరిష్ఠ ప్రయాణ నిడివి 30 నిమిషాలు ఉంటుందని అంచనా.
ఇప్పటికే మూడు సంస్థలు వాటర్ టాక్సీ సేవలు అందించేందుకు సన్నద్ధమవుతుండగా, రెండు మూడు నెలల తర్వాత మరో సంస్థ కూడా రంగంలోకి దిగనుంది. డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి నవీ ముంబై వరకు ఒక ప్రయాణికుడి నుంచి రూ.1200 నుంచి రూ.1500 వరకు వసూలు చేయనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ వరకు చార్జీ రూ.750 ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.