‘నిజాలు తెలుసుకోకుండా రేవంత్‌ను ఎలా సమర్ధిస్తారు’.. గులాంనబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ల సీరియస్

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌ తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. విషయం తెలుసుకోకుండా రేవంత్‌రెడ్డిని సమర్ధిస్తూ ఎలా లేఖ రాస్తారంటూ ఆజాద్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

  • Publish Date - March 12, 2020 / 07:27 AM IST

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌ తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. విషయం తెలుసుకోకుండా రేవంత్‌రెడ్డిని సమర్ధిస్తూ ఎలా లేఖ రాస్తారంటూ ఆజాద్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌ తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసారంటూ రేవంత్‌ తీరుపై గుర్రుమంటున్న సీనియర్లకు ఆ పార్టీ అగ్ర నేత గులాం నబీ ఆజాద్‌ రాసిన లేఖ పుండుమీద కారం చల్లినట్లైంది. విషయం తెలుసుకోకుండా రేవంత్‌రెడ్డిని సమర్ధిస్తూ ఎలా లేఖ రాస్తారంటూ ఆజాద్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అరెస్టయ్యారు సరే కానీ అసలేం జరిగింది అన్నది తెలుసుకోకుండా, పార్టీ ఇమేజ్‌ను ఎలా డామేజ్‌ చేశాడన్నది గుర్తించకుండా రాజ్యసభ ఫ్లోర్‌లీడర్‌ స్థాయి వ్యక్తి ఎలా స్పందిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అనుమతి లేకుండా డ్రోన్‌ కెమెరాలు వాడి ప్రైవేట్‌ నివాసాలను చిత్రీకరించిన కేసులో రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. చర్లపల్లి జైలుకు పంపారు. దీనిపై దీనిపై పార్టీ రాష్ట్ర నేతలెవరూ పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే రేవంత్‌ చేసిన పోరాటం పార్టీ పరంగా చేసినది కాదు. ఆయన లేవనెత్తిన అంశం కూడా పార్టీకి సంబంధించినది కాదు. కేవలం వ్యక్తిగతం మాత్రమే. రంగారెడ్డి జిల్లా గోపన్‌ పల్లిలో భూదందాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్‌ రెడ్డి.. దాన్నుంచి తప్పించుకోవడానికే జీవో 111ను తెరపైకి తెచ్చారని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనిపై పీసీసీ ద్వారా హైకమాండ్‌ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఇక్కడి విషయాలు తెలుసుకుంటోంది. రేవంత్ వ్యవహారం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉందని అర్థం కావడంతో హైకమాండ్‌ నుంచి కూడా పెద్దగా స్పందనలేదు. దీంతో రాష్ట్ర నేతలంతా సైలెంట్‌గా ఉన్నారు. 

వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్‌ రాజ్యసభ ప్లోర్‌లీడర్‌ గులాంనబీ ఆజాద్‌ ఓ లేఖను పంపారు. రేవంత్‌ అరెస్ట్ అన్యాయం, అక్రమం అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపీ వ్యవహారాన్ని ఎలా డీల్‌ చేయాలో అర్థం కాని పార్టీ నేతలు దీనిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అరెస్ట్ అయిన మాట వాస్తవమే అయినా దానికి కారణాలు కూడా తెలుసుకోవాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.  అయినా అసలు ఆయనకు ఏం సంబంధం ఆయనేమైనా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జా అని గుస్సా వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ తీరుతో పార్టీ ఇప్పటికే అభాసుపాలు కాగా ఇప్పుడు ఈ లేఖతో మరింత అప్రతిష్ఠ పాలవుతామని కాంగ్రెస్ నేతలు విలవిల్లాడుతున్నారు. 

ఇప్పటికే సీనియర్లు రేవంత్‌ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిందిపోయి… పార్టీ ఎజెండాగా మార్చడానికి రేవంత్ ఎలా ప్రయత్నిస్తారంటూ  కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నిస్తున్నారు. గోపనపల్లి భూముల వ్యవహారాన్ని ఎదుర్కోలేకే తెరపైకి ట్రిపుల్ వన్ జీవో అంశాన్నిర రేవంత్ తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ట్రిపుల్ వన్ పరిధిలో కాంగ్రెస్ వాళ్లవే ఎక్కువ నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు వీహెచ్.

వీహెచ్ ఒక్కరే కాదు… మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం రేవంత్ తీరును తప్పుబట్టారు. రేవంత్‌ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టారని మండిపడ్డారు  జగ్గారెడ్డి. ట్రిపుల్ వన్ జీవో అసలు సమస్యే కాదన్నారు. రేవంత్ వ్యవహారాన్ని తేల్చడానికి తక్షణం కోర్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. 111 జీవోకు, పీసీసీ పదవికి లింక్‌ పెట్టి చేస్తున్న ఫేస్‌బుక్‌లో రేవంత్ అనుచరులు చేస్తున్న ప్రచారంపైనా చర్చించాలని పట్టుబడుతున్నారు.

మరో సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా రేవంత్ తీరుని తప్పుబట్టారు. రేవంత్‌ లేవనెత్తిన అంశం కంటే ముఖ్యమైన సమస్యలు రాష్ట్రంలో చాలా ఉన్నాయని, భూ వివాదాలేవైనా ఉంటే కోర్టుల్లో తేల్చుకోవచ్చంటూ చురకలంటించారు. లేనిపోని వివాదాన్ని పార్టీ మెడకు రేవంత్‌ చుట్టడంపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 

See Also | పార్టీని గెలిపిస్తా…వేరేవారిని సీఎంను చేస్తా : రజనీకాంత్