Maharashtra Policits: అజిత్ పవార్ సీఎం కాబోతున్నారా? షిండేను పక్కన పెట్టే గేమా ఇది?
కొద్ది రోజుల క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురు చూడలేనని అజిత్ పవార్ అన్నారు. ఆ తర్వాత పరిణామాలు ఒక్కొక్కటిగా మారాయి. పార్టీలో కొందరికి పదవు మార్చారు, మరికొందరికి కీలక పదవులు ఇచ్చారు

Ajit Pawar and Eknath Shinde: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలను తన వెంటబెట్టుకుని వెళ్లిన అజిత్ పవార్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఎలా అయితే చేశారో అచ్చం అలాగే చేశారు అజిత్ పవార్. అయితే సరిపడా మెజారిటీ, స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పటికీ అజిత్ పవార్ గ్రూపును ప్రభుత్వంలోకి తీసుకోవడంలో పెద్ద రాజకీయమే ఉందని శివసేన, కాంగ్రెస్ పార్టీల నేతలు అంటున్నారు. ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో అజిత్ పవార్ను నిలిపేందుకే ఈ గేమ్ అంటున్నారు.
షిండేను బయటికి పంపించేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుగడ ఇదని శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. సోమవారం నాటి సామ్నా సంపాదకీయంలో సైతం ఈ విషయాన్ని ప్రముఖంగానే ప్రస్తావించారు. ‘‘అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఈసారి డీల్ చాలా పెద్దది. వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పవార్ అక్కడికి వెళ్లలేదు. ముఖ్యమంత్రి షిండే స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు. షిండేతో పాటు రెబెల్ ఎమ్మెల్యేలు తొందరనలోనే అనర్హతను ఎదుర్కొంటారు. అనంతరమే అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ ఆటలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పావులాగే ఉపయోగపడుతున్నారు. అయితే అజిత్ పవార్ భవిష్యత్తులో పెద్ద స్థానానికి వెళ్తారు’’ అని రాసుకొచ్చారు.
ఇక సంజయ్ రౌత్ స్పందిస్తూ ‘‘నేను ఈ రోజు కెమెరా ముందు చెప్తున్నాను. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారు. షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. ఆ వెంటనే షిండేను తొలగిస్తారు. ఇక ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసే పోటీ చేస్తాయని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ‘‘శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను తమ సొంత ప్రయోజనాల కోసం బీజేపీ చీల్చుతోంది. మేం కలిసే పోటీ చేస్తాం’’ అని అన్నారు. ఇక ఎన్సీపీ నేతలు తీవ్రమైన అవినీతిలో ఉన్నారని ప్రధాని మోదీ విమర్శలు చేసిన అనంతరమే ఆ నేతలను ప్రభుత్వంలో చేర్చుకోవడం ఏంటని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
కొద్ది రోజుల క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురు చూడలేనని అజిత్ పవార్ అన్నారు. ఆ తర్వాత పరిణామాలు ఒక్కొక్కటిగా మారాయి. పార్టీలో కొందరికి పదవు మార్చారు, మరికొందరికి కీలక పదవులు ఇచ్చారు. అయితే అజిత్ పవార్కు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు. అయితే తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అక్కర్లేదని, తనకు పార్టీలో ఏదైనా పదవి ఇవ్వాలని మీడియా ముందు అజిత్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. వాటిని పార్టీ ఖండిస్తున్న సమయంలోనే అజిత్ పవార్ తిరుగుబాటు జెండా ఎగరేసి అందరికీ షాకిచ్చారు.