జనసేన లాంగ్ మార్చ్ : టీడీపీ తరఫున ఆ ముగ్గురు

ఏపీలో ఇసుక కొరతకు నిరసనగా జనసేన ప్రజా క్షేత్రంలో పోరాటానికి సిద్ధమైంది. సర్కార్‌ తీరును తప్పుబడుతున్న ఆ పార్టీ... విశాఖలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది.

  • Publish Date - November 3, 2019 / 02:32 AM IST

ఏపీలో ఇసుక కొరతకు నిరసనగా జనసేన ప్రజా క్షేత్రంలో పోరాటానికి సిద్ధమైంది. సర్కార్‌ తీరును తప్పుబడుతున్న ఆ పార్టీ… విశాఖలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఏపీలో ఇసుక కొరతకు నిరసనగా జనసేన ప్రజా క్షేత్రంలో పోరాటానికి సిద్ధమైంది. సర్కార్‌ తీరును తప్పుబడుతున్న ఆ పార్టీ… విశాఖలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆదివారం(నవంబర్ 3,2019) సాయంత్రం మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుంచి లాంగ్‌ మార్చ్‌ ప్రారంభం కానుంది. అయితే.. టీడీపీ మినహా అన్ని పార్టీలూ పవన్ నిర్వహించ తలపెట్టిన లాంగ్‌మార్చ్‌కు హ్యాండిచ్చాయి. మరోవైపు… సభ వేదిక విషయంలో గందరగోళం ఏర్పడింది. 

ఇసుక కొరతను నిరసిస్తూ సాగరతీరంలో సమరభేరీ మోగించేందుకు సిద్ధమైంది జనసేన. విశాఖలో వేలాది మందితో లాంగ్ మార్చ్ చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు. ఇసుక లేక ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఆందోళనలను తీవ్రతరం చేసింది. ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి ప్రాణాలు తీసుకుంటున్న కార్మికుల బాధలు చూడలేకే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ర్యాలీ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

సాయంత్రం మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి లాంగ్‌ మార్చ్‌ మొదలవుతుంది. సీఎంఆర్‌ సెంట్రల్‌, రామాటాకీస్‌, ఆశీల్‌మెట్ట జంక్షన్‌ మీదుగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు లాంగ్‌మార్చ్‌ సాగుతుంది. అనంతరం ఉమెన్స్‌ కాలేజీ దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. దాదాపు 3 కిలోమీటర్ల వరకు లాంగ్‌ మార్చ్‌ జరగనుంది.  

అయితే… పవన్‌ కల్యాణ్‌కు విపక్షాలు హ్యాండిచ్చాయి. పవన్‌ ఫోన్‌ చేసి స్వయంగా ఆహ్వానించినా కుదరదని తేల్చి చెప్పాయి. లాంగ్‌ మార్చ్‌లో తాము పాల్గొనబోమని బీజేపీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా  జనసేన నిర్వహించే ర్యాలీకి హాజరు కాలేమని తేల్చిచెప్పింది. గత ఎన్నికల్లో జనసేన భాగస్వామ్యులుగా ఉన్న వామ పక్షాలు కూడా లాంగ్‌ మార్చ్‌కు మద్దతిచ్చేందుకు వెనకడుగు వేశాయి. లాంగ్‌ మార్చ్‌లో పాల్గొనాలంటూ పవన్‌ కల్యాణ్‌ బీజేపీని ఆహ్వానించడాన్ని తప్పుపట్టాయి. ర్యాలీలో తాము పాల్గొనబోమని సీపీఎం, సీపీఐ నేతలు స్పష్టం చేశారు. టీడీపీ మాత్రం జనసేన పార్టీ లాంగ్‌ మార్చ్‌లో పాల్గొంటామని ప్రకటించింది. లాంగ్‌ మార్చ్‌లో టీడీపీ తరపున గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు పాల్గొననున్నారు.

అన్ని పార్టీలు తిరస్కరించి కేవలం టీడీపీ మాత్రమే మద్దతు ప్రకటించడంతో వైసీపీ నేతలు విమర్శల దాడి పెంచారు. మద్దతుతో మరోసారి టీడీపీ జనసేన ఒక్కటేనని రుజువైందంటూ మండిపడ్డారు. పవన్ నిర్వహించేది లాంగ్ మార్చ్ కాదని… రాంగ్ మార్చ్ అంటూ కౌంటర్లిచ్చారు. 

మరోవైపు… పవన్‌ కల్యాణ్‌ లాంగ్‌ మార్చ్‌, బహిరంగ సభకు సంబంధించి వివాదం నెలకొంది. అనుమతించిన దానికంటే కూడా ఎక్కువ స్థలంలో వేదిక నిర్మిస్తున్నారంటూ పోలీసులు అడ్డుచెప్పారు. దీంతో రాత్రి సమయంలో బహిరంగ సభాస్థలి దగ్గర కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా జనసేన కార్యకర్తలు బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.