జనసేన అధినేత పవన్కళ్యాణ్ రాయలసీమ పర్యటన ఖరారైంది. (డిసెంబర్1, 2019) నుంచి ఆరు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది.
జనసేన అధినేత పవన్కళ్యాణ్ రాయలసీమ పర్యటన ఖరారైంది. (డిసెంబర్1, 2019) నుంచి ఆరు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. సీమ సమస్యలపై రైతాంగం, మేధావులతో పవన్ చర్చలు జరుపుతారు. డిసెంబర్ 1 న మధ్యాహ్నం ఒంటిగంటకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్లనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు రైల్వే కోడూరు చేరుకుని కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చించనున్నారు. అనంతరం జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. 2న ఉదయం 10 గంటలకు తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, నేతలతో సమావేశం నిర్వహిస్తారు. డిసెంబర్ 3న కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, నేతలతో సమావేశం అవుతారు.
డిసెంబర్ 4న మదనపల్లెకు చేరుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. 5న అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించి..స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చించనున్నారు. 6న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాయలసీమ జిల్లాల్లో అక్రమ కేసులు బనాయించడం వల్ల ఇబ్బందులు పడుతున్న నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వనున్నారు.