ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం : ప్రధాని మోడీ
ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
విశాఖ : ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. విశాఖలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇది అల్లూరి సీతారామరాజు తిరిగిన, నరసింహస్వామి వెలసిన ప్రాంతమన్నారు. విశాఖ ప్రజల చిరకాల వాంఛ.. విశాఖ రైల్వే జోన్ హామీని నెరవేర్చామని చెప్పారు. ఏపీని అభివృద్ధి చేయడంలో మరో ముందడుగు వేశామని తెలిపారు. ఇతర ప్రాంతాలకన్నా మెరుగైన రైల్వే సౌకర్యం ఏపీకి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రైల్వే జోన్ తో అదనంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. రైల్వే జోన్ తో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇక్కడున్న యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. అందమైన విశాఖను చూస్తే తన మనసు పులకరిస్తోందన్నారు.
ఆంధ్రా ప్రజలు అభివృద్ధి కాకుండా వారి పిల్లల అభివృద్ధి కోసమే కొందరు పని చేస్తున్నారని విమర్శించారు. యూ టర్న్ తీసుకునే నాయకులు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అవినీతిపరులే తనను గద్దె దించాలంటూ పిలుపునిస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ కూటమి కుటిలనీతి అర్థమైందన్నారు. ఎలాంటి ఎజెండా లేకుండా కూటమి కట్టారని విమర్శించారు. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ను తప్పుపడుతుంటే.. మనదేశంలో ఉన్న కొందరు పాకిస్తాన్ ను సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంపై జీఎస్టీని తగ్గించామని తెలిపారు. విశాఖ స్మార్ట్ సిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు.