కాకినాడ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే రైతు సౌభాగ్య దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం(డిసెంబర్ 12,2019) JNTU ఎదురుగా ఉన్న ఖాళీ
కాకినాడ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే రైతు సౌభాగ్య దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం(డిసెంబర్ 12,2019) JNTU ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో భారీ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ దీక్షకు ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు, రైతులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో దీక్షా శిబరం దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ప్రతీ ఒక్కరూ పవన్ను కలిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. రైతు భరోసా పథకంలో అగ్రవర్ణ రైతులకు జరుగుతున్న అన్యాయం.. గిట్టుబాటు ధర కల్పించకపోవడం, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకలపై ఈ దీక్ష చేపడుతున్నారు. దీక్షలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్తో పాటు కీలక నాయకులు ఇప్పటికే కాకినాడ చేరుకున్నారు. పవన్ బస చేసిన జిఆర్టీ గ్రాండ్ హోటల్ నుంచి దీక్షా శిబిరం వరకు రహదారిని జనసేన జెండాలతో ముస్తాబు చేశారు.
మండపేట పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించిన జనసేనాని రైతుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. రైతు భరోసా పథకంలో అగ్రవర్ణ పేదలకు జరుగుతున్న అన్యాయం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం, గిట్టుబాటు ధర కల్పించకపోవడంపై మండపేట రైతు సదస్సు వేదికగా తనదైన శైలిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. అంతేకాదు ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి మూడురోజుల డెడ్లైన్ విధించారు. రైతు సమస్యలను పరిష్కరించకపోతే కాకినాడ వేదికగా ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగుతానని అల్టిమేటం జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులవుతున్నా రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతు సౌభాగ్య దీక్షకు దిగుతున్నారు. ఈ దీక్షను సక్సెస్ చేసేందుకు జనసేన వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి.
పవన్ దీక్షకు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో దీక్షకు హాజరుకావడం లేదని చెప్పారు. అలాగే పార్టీ నిర్మాణం జరగడం లేదని, ఈ విషయంలో పవన్కు తనకు మధ్య విభేదాలున్నాయని బాహాటంగా ప్రకటించారు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై సీఎం జగన్ను కురిపించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ మన నుడి-మన నది కార్యక్రమం చేపడుతుండగా… దానికి వ్యతిరేకంగా రాపాక వ్యవహరించడంపై పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనికితోడు ఇవాళ రైతులకు సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటిస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పడంతో… జనసేనకు గట్టి షాక్ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.