Sharad Pawar and his Nephew Ajit Pawar
Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party) అధ్యక్షుడి పదవికి రాజీనామా విషయంలో శరద్ పవార్ (Sharad Pawar) పునరాలోచన చేయడానికి అంగీకరించారని అజిత్ పవార్ (Ajit Pawar) చెప్పారు. శరద్ పవార్ (83) తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం అజిత్ పవార్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులె సహా పలువురు నేతలు ఆయన వద్దకు వెళ్లారు.
శరద్ పవార్ తో చర్చించారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం అజిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. “రాజీనామాపై నిర్ణయం తీసుకునున్నానని శరద్ పవార్ అన్నారు. అయితే, పార్టీ నేతలందరి కోసం తాను పునరాలోచిస్తానని చెప్పారు. తనకు రెండు-మూడు రోజుల సమయం కావాలని అన్నారు.
పార్టీ కార్యకర్తలు అందరూ తమ ఇళ్లకు వెళ్లిపోతేనే నేను ప్రశాంతంగా ఆలోచించుకోగలుగుతాననని శరద్ పవార్ చెప్పారు. పార్టీలో పలు పదవుల్లో ఉన్న వారు కూడా రాజీమానాలు చేస్తున్నారని అన్నారు. ఆ తీరు మానుకోవాలని చెప్పారు” అని అజిత్ పవార్ మీడియాకు తెలిపారు.
ఎన్సీపీకి శరద్ పవారే అధ్యక్షుడిగా ఉండాలని, పార్టీకి ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించాలని ఆయనను పార్టీ నేతలు కోరారని తెలిపారు. శరద్ పవార్ తీసుకున్న నిర్ణయం పట్ల పార్టీ నేతలు నిరాశలో ఉన్నట్లు తాను ఆయనకు చెప్పామని అన్నారు. కాగా, శరద్ పవార్ నిర్ణయం పట్ల రాజకీయ వర్గాలు షాక్ అయ్యాయి. ఆయన రాజీనామా నిర్ణయం పట్ల కారణాలపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి.