Ramcharitmanas: రామచరితమానస్ మీద మండిపడ్డ మరో నేత.. SC, ST, OBC లను తిట్టారంటూ సంచలన కామెంట్స్
కొన్ని కోట్ల మంది ఈ గ్రంథాన్ని చదవలేదు. ఇందులో ఉన్నదంతా తప్పిదమే. వ్యక్తిగత ఆనందం కోసం, ప్రశంసల కోసం తులసీదాస్ ఈ గ్రంథాన్ని రాశారు. ధర్మం అంటే మేం దాన్ని స్వాగతిస్తాం. కానీ ధర్మం పేరు మీద దూషణలేంటి? దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల మీద దూషణలు ఎందుకు చేశారు? వారికి శూద్రులని పేరు పెట్టి ఎందుకు వారిపై వివక్ష చూపించారు? దూషించడం, వివక్ష చూపించడమే ధర్మమా? అయితే అలాంటి ధర్మం అవసరం లేదు
- tony bekkal
- Published On : January 23, 2023 / 07:11 PM IST
SP’s Swami Prasad Maurya criticises Ramcharitmanas
Ramcharitmanas: రామచరితమానస్ విధ్వేషాలు రెచ్చగొడుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీశారు బిహార్ విద్యాశాఖ మంత్రి మంత్రి చంద్రశేఖర్. కొద్ది రోజుల క్రితం ఇది ఉత్తర భారత రాజకీయాల్ని తీవ్రంగా కుదిపివేసింది. అయితే అది కాస్త చల్లబడిందో లేదో, మరో నేత అదే రామచరితమానస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి దుమారానికి తెరలేపారు. అయితే ఈసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆ గ్రంథంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీల మీద చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, వారిని అనుచిత వ్యాఖ్యలతో దూషించారని మౌర్య అన్నారు. అటు ఇటుగా బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా అన్నట్లే స్వామి ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆ గ్రంథం ఉందని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఆ పుస్తకాన్ని చదివితే వెనుకబడిన వారు దళితులు ఆగ్రహంతో రగిలి పోతారని, అల్లర్లు కూడా జరగొచ్చని అన్నారు.
ఇక ఈ గ్రంథంపై ఎమ్మెల్సీ అయిన స్వామి ప్రసాద్ మౌర్య తాజాగా స్పందిస్తూ ‘‘కొన్ని కోట్ల మంది ఈ గ్రంథాన్ని చదవలేదు. ఇందులో ఉన్నదంతా తప్పిదమే. వ్యక్తిగత ఆనందం కోసం, ప్రశంసల కోసం తులసీదాస్ ఈ గ్రంథాన్ని రాశారు. ధర్మం అంటే మేం దాన్ని స్వాగతిస్తాం. కానీ ధర్మం పేరు మీద దూషణలేంటి? దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల మీద దూషణలు ఎందుకు చేశారు? వారికి శూద్రులని పేరు పెట్టి ఎందుకు వారిపై వివక్ష చూపించారు? దూషించడం, వివక్ష చూపించడమే ధర్మమా? అయితే అలాంటి ధర్మం అవసరం లేదు’’ అని స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు.
విచిత్రం ఏంటంటే.. పోయిన ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈయన భారతీయ జనతా పార్టీ నేత. సరిగ్గా ఎన్నికల సమయానికి ముందు సమాజ్వాది పార్టీలో చేరారు. యూపీలోని ఓబీసీ నేతల్లోని ప్రముఖుల్లో మౌర్య ఒకరు. మౌర్య సామాజిక వర్గానికి ఈయనే పెద్ద నాయకుడిగా గుర్తింపు ఉంది. దీంతో బీజేపీ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీజేపీ ఉన్నప్పుడు నచ్చినవి ఇప్పుడెందుకు నచ్చట్లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
