తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థులు టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి ఎక్కువ టైమ్ లేదు. దీంతో అభ్యర్థులు స్మార్టుగా ప్రచారం వైపు దృష్టి సారించారు. ఇది స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కాలం. ఇంటర్నెట్ లేని మొబైల్ లేదు. దీంతో అభ్యర్థులు అన్ లిమిటెడ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వార్డుల వారీగా వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసి ఓట్లను అభ్యరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని హోరెత్తించారు. ‘ప్రజాసేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించండి, ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తాం’ అంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
వాట్సాప్, ఫేస్ బుక్ లో ప్రచారం:
ఎన్నికల్లో గెలిస్తే చేపట్టే అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు తయారు చేసి వాట్సాప్, ఫేస్బుక్ సాయంతో ప్రతి ఓటర్ కు చేరవేస్తున్నారు. అభ్యర్థుల మద్దతుదార్లు వార్డుల వారీగా ఉంటే ఓటర్లకు సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్లు సేకరించి వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కూర్చున్న చోటు నుంచి అభ్యర్థులు ఓటర్లుకు ఫోన్లు చేస్తున్నారు. ఇంటింటి ప్రచారాలకు తోడు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి పలకరిస్తే అధిక ఓట్లు రావచ్చనే భావనతో అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు.
వాట్సాప్ ద్వారా ఓటు, పోలింగ్ స్టేషన్ వివరాలు:
కొంత మందికి ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో అన్న విషయం తెలియదు. పోలింగ్ కేంద్రాల గురించి సమచారం లేదు. దీంతో ఓటరు జాబితాలతో పాటుగా పోలింగ్ స్టేషన్ల వివరాలను వాట్సాప్లలో పంపిస్తున్నారు. అదే విధంగా ఇటీవల ఎన్నికల సంఘం కొత్తగా రూపొందించిన పోర్టల్ ద్వారా సమాచారాన్ని సేకరించి అభ్యర్థులకు చేరవేస్తున్నారు. ఓటు ఏ వార్డులో ఉంది.. ఏ కేంద్రంలో ఓటు వేయాలన్న విషయాలను అభ్యర్థులు వాట్సాప్ ద్వారా ఓటర్లకు చేరవేస్తున్నారు.
మేసేజ్ లు, వీడియోలతో ప్రచారం:
ఎన్నికల ప్రచారానికి పోస్టులు తయారు చేసుకునేందుకు ఇంటర్ నెట్లో పలు యాప్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రచార పత్రాలను తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు తమ పని తీరు, చేసిన అభివృద్ధి అంశాలను జోడించి సందేశాలు, వీడియోలు రూపొందిస్తున్నారు. కొత్తగా పోటీ చేసే అభ్యర్థులు హామీలు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు.. హామీలకు వేదికలుగా సోషల్ మీడియా మారింది.
పోలీసులు గమనిస్తున్నారు జాగ్రత్త:
ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్న విషయాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా చేసే ప్రచారంలో… కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉంది. అభ్యంతరకర అంశాల ప్రచారాల పై ఎన్నికల అధికారులతో పాటుగా, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఫిర్యాదులు స్వీకరించి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.