కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. అంతేకాదు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకి పంపారు.
వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్, ప్రభుత్వ అధికారులపై వంశీ ఆరోపణలు చేశారు. కుట్ర రాజకీయాలు, అధికారుల పక్షపాతి వైఖరి వల్ల నేను, నా అనుచరులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయామని వాపోయారు. తన వల్లే తన అనుచరులకు ఇబ్బందులు పెరిగినట్టు భావిస్తున్నా అన్నారు. వీటిని తప్పించుకోవడానికి బలమైన అవకాశం ఉన్నా తన మనసు అంగీకరించడం లేదన్నారు.
అందుకే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా అని వంశీ వెల్లడించారు. ఇంతకాలం అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకి వంశీ కృతజ్ఞతలు తెలిపారు. వంశీ 2006లో టీడీపీలో చేరారు. 2009లో విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.
వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెబుతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో లేదా బీజేపీలో జాయిన్ అవుతారని వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే ఆయన సీఎం జగన్ ని కలిశారు. ఇద్దరు మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని స్వయంగా వంశీని దగ్గరుండి మరీ సీఎం జగన్ దగ్గరికి తీసుకెళ్లారు.
సీఎం జగన్ తో వంశీ మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కసారిగా గన్నవరం రాజకీయాలు వేడెక్కాయి. వంశీ వైసీపీలో చేరతారని అంతా అనుకుంటున్న సమయంలో.. వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుని అందరికి షాక్ ఇచ్చారు.