అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మాత్రమే రద్దు చేశామన్నారు. అసైన్డ్ భూములను రైతులకు ఇచ్చేస్తామని చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 13 జిల్లాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. శుక్రవారం (డిసెంబర్ 20, 2019 అమరావతిలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న భవనాలన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మాత్రమే రద్దు చేశామన్నారు. అసైన్డ్ భూములను రైతులకు ఇచ్చేస్తామని చెప్పారు.
రైతులకు డెవలప్ మెంట్ ప్లాట్లు ఇస్తామని..త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై డిసెంబర్ 27న కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నిపుణుల కమిటీ నివేదికతో ప్రభుత్వం ఏకీభవిస్తుందనే అనుకుంటున్నానని అన్నారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్షమన్నారు. రాజధాని రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందన్నారు. 13 జిల్లాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం ఆలోచిస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూములను అభివృద్ధి చేసి రైతులకు ఫ్లాట్ల రూపంలో ఇస్తామని చెప్పారు.
మంత్రి పెద్దిరెడ్డి రాజధానిలోని అసైన్డ్ భూములపై మాట్లాడారని..ఆ భూములను రైతులకే తిరిగి అప్పగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాధాన్యతలు తమకు ముఖ్యమని..కొందరి ఉద్దేశాలు కాదన్నారు. ప్రజలకు మాత్రమే జవాబుదారులమని..ప్రతిపక్షానికి కాదన్నారు.