Tiruvannamalai Girivalam : తిరువణ్ణామలై పౌర్ణమి గిరి ప్రదక్షిణ రద్దు-జిల్లా కలెక్టర్
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో పౌర్ణమి రోజు జరిగే గిరి ప్రదక్షిణను (గిరివలం) కోవిడ్ నిబంధనల కారణంగా రద్దు చేస్తున్నట్లు తిరువణ్ణామలై కలెక్టర్ చెప్పారు.
- murthy
- Published On : July 21, 2021 / 04:48 PM IST
Thiruvannamalai Girivalam
Tiruvannamalai Girivalam : తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో పౌర్ణమి రోజు జరిగే గిరి ప్రదక్షిణను (గిరివలం) కోవిడ్ నిబంధనల కారణంగా రద్దు చేస్తున్నట్లు తిరువణ్ణామలై కలెక్టర్ చెప్పారు. తమిళ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ పౌర్ణమి జులై 23 శుక్రవారం ఉదయం గం.10-35 నుంచి జులై 24 శనివారం ఉదయం గం.8-47 వరకు ఉంటుంది.
శుక్ర, శనివారాలలో భక్తులను గిరి ప్రదక్షిణకు అనుమతించటంలేదని కలెక్టర్ వివరించారు. ఈ రెండు రోజులు అరుణాచలేశ్వరుని దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ..కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి, శానిటైజర్ వాడుతూ.. భౌతిక దూరం పాటిస్తూ భక్తులు స్వామి వారి దర్శనం చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
ప్రతిరోజు ఉదయం గం.5-30 నుండి రాత్రి గం.8-00 వరకు ఆలయం తెరిచి ఉంటుందని కలెక్టర్ చెప్పారు. గిరి ప్రదక్షిణ కోసం భక్తులు దూర ప్రాంతాల నుంచి రావద్దని ఆయన కోరారు. ధర్మ దర్శనం చేసుకునే భక్తులు తూర్పు రాజగోపురం ద్వారాను, ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులు ఈశాన్య గోపురం నుంచి రావాలని చెప్పారు.
