Srirama Kalyanam
Sri Rama Kalyanam In Bhadradri : భద్రాచలంలో రాములోరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిథిలా స్టేడియంలో జరగనున్న కల్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 12 గంటలకు…పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సముహూర్తంలో…శ్రీరాముడు, సీతాదేవికి కల్యాణం నిర్వహించనున్నారు. ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు తెలంగాణ నుంచే కాదు, ఏపీ, చత్తీస్గడ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
Read More : Sriramanavami : శ్రీరామ శోభాయాత్ర.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు
10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు రామయ్య కల్యాణ కమనీయ దృశ్యాలను కనులారా వీక్షించనున్నారు భక్తులు. ఉదయం 9.30 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను మిథిలాస్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తరలిస్తారు. కరోనాతో రెండేళ్ల పాటు జగదాబిరాముడి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్షంగా తిలకించలేకపోయారు. దీంతో ఈసారి కనులారా వీక్షించేందుకు వేలాది మంది భద్రాచలం చేరుకున్నారు. సోమవారం రాములవారి పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దేవస్థానం అధికారులు.
Read More : Ram Navami 2022 : సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన భద్రాద్రి
భద్రాచలంలో రామాలయం పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, కరకట్ట ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది. రెండు లక్షల 50 వేల మంది తరలివస్తారని అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియం వెలుపల నిల్చుని కల్యాణోత్సవం వీక్షించేలా టీవీలు అమర్చారు. గ్యాలరీల్లో కూలర్లు బిగించారు. ఎండదెబ్బ తగలకుండా.. తాగు నీటితో పాటు మజ్జిగ అందిస్తున్నారు. తలాంబ్రాలు, లడ్డూ ప్రసాదాల కోసం పట్టణంలో 24 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నీడలో.. సీతారాముల కల్యాణోత్సవం జరగనుంది.