×
Ad

Womens World Cup: మోదీ ప్రభుత్వ హయాంలో దుమ్ముదులుపుతున్న భారత క్రీడా రంగం.. ఎలా సాధ్యమైంది? ఏ మార్పులు చేశారు?  

ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో గత 11 ఏళ్లలో భారత క్రీడా వ్యవస్థ పూర్తిగా మారింది. కొత్త తరం క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తున్నారు.

Womens World Cup: భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచ కప్‌ 2025 ఫైనల్లో భారత్‌ దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి 52 ఏళ్ల టోర్నమెంట్‌ చరిత్రలో తొలిసారి టైటిల్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ జట్టు కలిసింది. వారికి మోదీ అభినందనలు తెలిపారు.

పాలసీలు స్పష్టంగా ఉంటే ఫలితాలు కూడా ఫలప్రదంగా ఉంటాయని.. క్రీడలను ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం చేపట్టిన సానుకూల చర్యలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయి. (Womens World Cup)

సమాన వేతనం-సమాన గౌరవం

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత్‌ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచ కప్‌ గెలుచుకుంది. ఈ విజయానంతరం బీసీసీఐ మహిళా జట్టుకు రూ.51 కోట్లు బహుమతిగా ప్రకటించింది.

టైటిల్‌ గెలుచుకున్నందుకు మహిళా జట్టుకు రూ.41.77 కోట్లు బహుమతిగా అందాయి. ఇది 2022లో ఉన్న మొత్తానికి నాలుగు రెట్లు ఎక్కువ. బీసీసీఐ అదనంగా రూ.51 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేయడంలో బీసీసీఐ కీలక పాత్ర పోషించింది. కోచింగ్‌ సదుపాయాలు, సపోర్ట్‌ స్టాఫ్‌, శిక్షణను మెరుగుపరిచింది. భారత మహిళా ఆటగాళ్ల వేతనాలు పెరిగాయి. ఐసీసీ మహిళా టోర్నమెంట్‌ల బహుమతి మొత్తం పురుషుల టోర్నమెంట్‌లకంటే ఎక్కువైంది. 2022 అక్టోబరులో బీసీసీఐ 15వ ఏపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన మ్యాచ్‌ ఫీజులు అమలు చేసింది. వేతన పెంపు అనేకమంది మహిళా ప్లేయర్లను మరింత ప్రోత్సహించింది. ఈ నిర్ణయంతో భారత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

బీసీసీఐ సమాన వేతనం గురించి చర్చించడమే కాకుండా అమలు చేసిన కొద్ది బోర్డుల్లో ఒకటిగా నిలిచింది. 2018లో తొలిసారిగా మహిళా ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ శిక్షణ, యో-యో టెస్ట్‌ తప్పనిసరి చేశారు. 2019లో మహిళా ప్లేయర్ల సెంట్రల్‌ కాంట్రాక్టులను సవరించారు. 2025 నాటికి కాంట్రాక్టు ప్లేయర్లు సంవత్సరానికి రూ.75 లక్షల నుంచి రూ.3 కోట్ల మధ్య సంపాదిస్తున్నారు.

అమెరికా మహిళా ఫుట్‌బాల్‌ జట్టు సమాన వేతనాల కోసం సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేసింది. కానీ, భారతదేశంలో బీసీసీఐ నమ్మకంతో, విధానాల ఆధారంగా స్వయంగా మార్పును తీసుకువచ్చింది. ఫలితాలు అందరికీ కనిపిస్తున్నాయి.

Also Read: దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కి భారత స్క్వాడ్ ప్రకటన.. రిషబ్ మళ్లీ వచ్చేశాడు.. పాపం ఆ బౌలర్‌ని మాత్రం తీసి పక్కన పెట్టి..

గేమ్‌ ఛేంజర్‌గా డబ్ల్యూపీఎల్‌ 

గతంలో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ కంటే భారత మహిళా క్రికెట్‌ వెనుకబడి ఉండేది. టీమిండియా ముందుకు దూసుకు రావడానికి 2023లో మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ప్రారంభమైంది.

డబ్ల్యూపీఎల్‌ వల్ల భారత ప్లేయర్లకు ప్రపంచస్థాయి క్రికెటర్లతో ఆడే అవకాశం ఇచ్చింది. దీనివల్ల వారి ఆత్మవిశ్వాసం, ప్రదర్శన రెండూ పెరిగాయి.

డబ్ల్యూపీఎల్‌ ప్రారంభం తర్వాత జట్టు మేనేజ్‌మెంట్‌ దేశీయ క్రికెట్‌పై దృష్టి పెట్టింది. 2017 వరకు జట్టులో ప్రధానంగా ఢిల్లీ, ముంబై, దక్షిణ భారత ఆటగాళ్లే ఉండేవారు. కొత్త స్కౌటింగ్‌ వ్యవస్థతో రాయ్‌గఢ్‌, హిసార్‌, ఆగ్రా, సిల్చర్‌ వంటి చిన్న పట్టణాల నుంచి ప్రతిభావంతులను ఎంపిక చేశారు.

మోదీ ప్రభుత్వం ఇంకా ఏయే మార్పులు తీసుకొచ్చింది?

మహిళల వన్డే ప్రపంచ కప్‌ 2025లో భారత విజయం మోదీ ప్రభుత్వం క్రీడల పట్ల ఎంత గొప్ప విధానాలను అవలంబించిందో నిరూపిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 15న క్రీడలపై స్పందిస్తూ.. “దేశమంతటా కుటుంబాలు తమ ఇళ్లలో క్రీడలను ప్రోత్సహిస్తున్నప్పుడు నా హృదయం గర్వంతో నిండిపోతుంది. ఇది మన దేశ భవిష్యత్తుకు అత్యంత సానుకూల సూచన అని నేను భావిస్తున్నాను” అని చెప్పారు.

  • మోదీ నాయకత్వంలో గత 11 సంవత్సరాల్లో భారత క్రీడారంగానికి విశేష గుర్తింపు దక్కింది. దీర్ఘకాలిక వ్యూహాలు వేసుకోవడం, ప్రధాన మంత్రి వ్యక్తిగతంగా క్రీడాకారులతో మమేకం అవుతుండడం, ఆధునిక క్రీడా సదుపాయాలను సృష్టించడం, పెరిగిన బడ్జెట్, ప్రత్యేక పథకాలతో ఈ గుర్తింపు సాధ్యమైంది.
  • మోదీ ప్రభుత్వం క్రీడా సదుపాయాలపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చింది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ బడ్జెట్‌ అనేక రెట్లు పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆ మంత్రిత్వ శాఖకు రూ.3,794 కోట్ల రికార్డు కేటాయింపు జరిగింది. ఇది 2014-15తో పోల్చితే 130.9% పెరుగుదల.
  • యువ క్రీడాకారులకు ఆధునిక సదుపాయాలు అందించేందుకు దేశవ్యాప్తంగా రూ.3,074 కోట్ల వ్యయంతో 323 కొత్త క్రీడా మౌలిక సదుపాయ ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడింది.
  • ‘ఖేలో ఇండియా’, ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS)’ వంటి ప్రధాన కార్యక్రమాలు భారత క్రీడా వ్యవస్థకు ఊతాన్ని ఇచ్చాయి. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అంటే ఒలింపిక్ పతకాలు సాధించే సామర్థ్యమున్న క్రీడాకారులకు నెలవారీ భృతి, శిక్షణ, అంతర్జాతీయ పోటీ ఖర్చులు అందించే కేంద్ర పథకం.
  • భారత జనాభాలో 65% మంది 35 ఏళ్లలోపువారే ఉండడంతో క్రీడలను యువ శక్తి సాధికారతలో ప్రధాన అంశంగా మార్చారు.
    మహిళా క్రీడాకారిణులకు అన్ని క్రీడల్లో సమాన అవకాశాలు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు “అస్మిత మహిళా లీగులు” కొనసాగిస్తున్నారు.
  • క్రీడలను గ్రామస్థాయికి తీసుకెళ్లటానికి 11,000 యువజన క్లబ్బులకు క్రీడా పరికరాలు అందించారు.
  • గత 11 ఏళ్లలో క్రీడా రంగం వేగంగా సంస్థాగత అభివృద్ధి సాధించింది. మణిపూర్‌లో నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించారు. ఇందులో క్రీడా విజ్ఞానం, కోచింగ్‌, ప్రదర్శనలపై విద్యా కార్యక్రమాలు అందుతున్నాయి. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బాగా ఉపయోగపడుతోంది.
  • నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ చట్టం 2025 చారిత్రాత్మక సంస్కరణలను తీసుకొచ్చింది. క్రీడాకారుల ప్రాతినిధ్యం తప్పనిసరి చేయడం, లింగ సమానత్వం, సురక్షిత క్రీడా విధానం, పారదర్శకత వంటి అంశాలతో పాటు క్రీడా సంస్థలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది.
  • ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో గత 11 ఏళ్లలో భారత క్రీడా వ్యవస్థ పూర్తిగా మారింది. కొత్త తరం క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తున్నారు.