టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీల్లోనే ఎక్కువగా ఆడాడు. ఈ ముగ్గురిలో రోహిత్ శర్మనే అత్యుత్తమ కెప్టెన్ అని అశ్విన్ చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండు మూడు అంశాలు ఎంతో బాగుంటాయన్నాడు. జట్టు వాతావరణాన్ని హిట్మ్యాన్ ఎంతో తేలికగా ఉంచుతాడన్నాడు. ఓ ఆటగాడికి 100 శాతం మద్దతు ఇస్తాడని చెప్పాడు. ఇక వ్యూహాత్మకంగా రోహిత్ ఎంతో బలవంతుడు అని చెప్పుకొచ్చాడు. వ్యూహాత్మకంగా ధోనీ, కోహ్లి కూడా బలవంతులే అయినప్పటికీ కానీ రోహిత్ మాత్రం వ్యూహాలపై మరింత ఎక్కువగా పని చేస్తాడని తెలిపాడు.
Mohammed Shami : రోహిత్, ద్రవిడ్లపై షమీ కౌంటర్లు.. మళ్లీ ఆ ఇద్దరికి ఆ ఆలోచన రాలేదు
ఏదైన పెద్ద మ్యాచ్ లేదా సిరీస్ ఉందంటే.. ఎనలిటిక్స్ టీమ్, కోచ్లతో కలిసి రోహిత్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంటాడు. బ్యాటర్ బలహీనత ఏంటి, బౌలర్కు ఏ ప్లాన్ వర్కౌట్ అవుతుందని చర్చిస్తాడు. అదే అతడి బలం. ఓ ఆటగాడు తుది జట్టులో ఎంపికైతే అతడికి 100 శాతం మద్దతు ఇస్తాడు. నా కెరీర్ మొత్తం ఈ ముగ్గురి కెప్టెన్సీలోనే ఆడాను అని అశ్విన్ తెలిపాడు.
ఆర్ అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరఫున 100 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. ఇక ఎంఎస్ ధోనీ 2007 నుంచి 2018 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అతడి సారథ్యంలో మూడు ఫార్మాట్లో కలిపి 332 మ్యాచులు ఆడగా 178 మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. 2013 నుంచి 2022 వరకు విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 213 మ్యాచ్లు ఆడగా 135 మ్యాచుల్లో గెలిచింది. 2022లో నుంచి ఇప్పటి వరకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టుకు 126 మ్యాచ్లు ఆడగా 93 మ్యాచుల్లో గెలిచింది.