Pakistan captain Babar Azam : న్యూయార్క్లోని నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ లోస్కోరింగ్ మ్యాచ్లో భారత జట్టు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్పంత్ (42; 31 బంతుల్లో 6 ఫోర్లు) టాప్ స్కోరర్. పంత్తో పాటు రోహిత్ శర్మ (13), అక్షర్ పటేల్ (20) లు మినహా మిగిలిన అందరూ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లి (4), సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దూబె (3), హార్దిక్ పాండ్యా (7), రవీంద్ర జడేజా (0) లు ఘోరంగా విఫలం అయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో నసీమ్ షా, హారిస్ రవూఫ్ లు చెరో మూడు వికెట్లు తీశారు. మహ్మద్ ఆమిర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులకే పరిమితమైంది.
Rohit Sharma : రోహిత్ శర్మ కామెడీ.. పడిపడి నవ్విన పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం.. మ్యాచ్ గోవిందా..?
పాకిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (31; 44 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్. బాబర్ ఆజాం (13), ఉస్మాన్ ఖాన్(13), ఫఖర్ జమాన్ (13), ఇమాద్ వసీం (15) లకు మంచి ఆరంభాలు లభించినా వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్య రెండు వికెట్లు, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ లు చెరో వికెట్ సాధించారు.
కాగా.. ఈ మ్యాచ్లో ఎక్కువగా డాట్ బాల్స్ చేయడమే తమ ఓటమిని ప్రధాన కారణమని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం చెప్పాడు. బౌలర్లు తమ పాత్రను అద్భుతంగా నిర్వర్తించారని మెచ్చుకున్నాడు. పిచ్ ను సద్వినియోగం చేసుకుని వరుసగా వికెట్లు తీస్తూ భారత బ్యాటర్లను ఒత్తడిలోకి నెట్టారన్నాడు. అయితే బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడాల్సి ఉందన్నాడు.
IND vs PAK : సూపర్ ఫ్యాన్.. టీమ్ఇండియా జెర్సీతో కనిపించిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల..
వరుసగా వికెట్లు కోల్పోవడం నష్టం చేసిందని, డాట్ బాల్స్ ఎక్కువగా చేయకుండా ఉండాల్సిందన్నాడు. స్ట్రైక్ను రొటేట్ చేయడంలో విఫలం అయ్యామని, పిచ్ను బాగానే ఉందని చెప్పుకొచ్చాడు. కొన్ని బాల్స్ మాత్రం ఎక్స్ట్రా బౌన్స్ వచ్చాయడన్నాడు. మ్యాచ్లో ఎక్కడ పొరపాట్లు చేశామనేది చర్చించుకుని ఈ టోర్నీలో మిగిలిన మ్యాచుల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తామని బాబర్ తెలిపాడు.