MI vs GT : గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ మ్యాచ్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న రికార్డులు ఇవే..
మంగళవారం వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
- Thota Vamshi Kumar
- Published On : May 6, 2025 / 09:58 AM IST
Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా మంగళవారం వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ క్రమంలో ముంబై స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. గుజరాత్తో మ్యాచ్లో రోహిత్ శర్మ 79 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్లో 7వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కనున్నాడు.
ఐపీఎల్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 267 మ్యాచ్లు ఆడాడు. 262 ఇన్నింగ్స్ల్లో 29.8 సగటు 132 స్ట్రైక్రేటుతో 6921 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా 626 ఫోర్లు, 297 సిక్సర్లు హిట్మ్యాన్ బాదాడు.
ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 263 మ్యాచ్లు ఆడాడు. 255 ఇన్నింగ్స్ల్లో 39.57 సగటు 132.60 స్ట్రైక్రేటుతో 8509 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 749 ఫోర్లు, 290 సిక్సర్లను కోహ్లీ బాదాడు.
రోహిత్ శర్మ తన ఐపీఎల్ కెరీర్ను డెక్కన్ ఛార్జర్స్తో ప్రారంభించాడు. 2008 నుంచి 2010 వరకు డెక్కన్ తరుపున 45 మ్యాచ్లు ఆడాడు. 44 ఇన్నింగ్స్ల్లో 30.79 సగటు 131 కంటే ఎక్కువ స్ట్రైక్రేటుతో 1170 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక ముంబై తరుపున 222 మ్యాచ్లు ఆడాడు. 218 ఇన్నింగ్స్ల్లో 29.64 సగటు 132 స్ట్రైక్రేట్తో 5751 పరుగులు ఉన్నాయి. ఇందులో రెండు సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
మరో మూడు సిక్సర్లు కొడితే.. ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత బ్యాటర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టిస్తాడు. ఇక ఓవరాల్గా క్రిస్గేల్ (357) తరువాత రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. 10 మ్యాచ్ల్లో 32.55 సగటు 155 కంటే ఎక్కువ స్ట్రైక్రేటుతో 293 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
