Yashasvi Jaiswal : టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసిన జైస్వాల్..
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు.
Yashasvi Jaiswal – Rahul Dravid : రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఆర్ఆర్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. సోమవారం జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ ద్వారా అతడు ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 60 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 9 ఫోర్లు, 7 సిక్సర్లలో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలోనే రాజస్థాన్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. అదే సమయంలో ప్రస్తుత టీమ్ఇండియా హెడ్ కోచ్, ఆర్ఆర్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు. రాహుల్ ద్రవిడ్ ఆర్ఆర్ తరుపున 52 మ్యాచులు ఆడాడు. 27.02 సగటు 108.88 స్ట్రైక్రేటుతో 1324 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 66 పరుగులు.
కాగా.. ముంబైతో మ్యాచ్ కలిపి జైస్వాల్ ఇప్పటి వరకు 45 మ్యాచులు ఆడాడు. 32.48 సగటు 150.05 స్ట్రైక్ రేటుతో 1,397 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, ఎనిమిది అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 124
రాజస్థాన్ రాయల్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డు ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ పేరిట ఉంది. శాంసన్ 138 మ్యాచ్లలో 3,717 పరుగులు చేశాడు. 31.50 సగటు, 139.78 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. రెండు సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. అత్యధిక స్కోరు 119.
ప్రస్తుత సీజన్లో జైస్వాల్ ఎనిమిది మ్యాచుల్లో 32.14 సగటు, 157.34 స్ట్రైక్రేటుతో 225 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచులు ఆడగా ఏడింటింలో విజయాన్ని అందుకుంది. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో ఆరు మ్యాచులు ఆడాల్సి ఉంది. కనీసం రెంటింలో గెలిచినా కూడా రాజస్థాన్ ఈజీగా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది.