Sunil Gavaskar : జైస్వాల్ నువ్వు ముంబై కుర్రాడివేగా.. ఎందుకు ఇలా చేస్తున్నావ్.. వాళ్లు అంటే ఎందుకు అంత పగ ? : సునీల్ గవాస్కర్
మ్యాచ్ అనంతరం దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ శతక వీరుడు జైస్వాల్ ను సరదాగా ప్రశ్నించాడు.
Sunil Gavaskar – Yashasvi Jaiswal : ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ను అందుకున్నాడు. గత ఏడు ఇన్నింగ్స్ల్లో 24, 5, 10, 0, 24, 39, 19 పరుగులు చేసిన అతడు సోమవారం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో శతక్కొట్టాడు. కేవలం 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సీజన్లో అతడికి ఇదే తొలి శతకం కాగా.. ముంబై ఇండియన్స్ పై రెండోది కావడం విశేషం.
ఈ క్రమంలో ఐపీఎల్లో రెండు సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడిగా (22ఏళ్ల 116 రోజులు)గా చరిత్ర సృష్టించాడు. ఇక మ్యాచ్ అనంతరం దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ శతక వీరుడు జైస్వాల్ ను సరదాగా ప్రశ్నించాడు. “యశస్వీ! సునీల్ ఇక్కడ.. నువ్వు ముంబై కుర్రాడివి. కాగా.. ముంబై ఇండియన్స్పై ఇది నీకు రెండో సెంచరీ. నువ్వు ముంబై పైనే సెంచరీలు చేస్తావా? ఇతర జట్ల పై చేయవా?” అని అడిగాడు.
“అలాంటిది ఏమీ లేదు. నేను మెరుగ్గా రాణించాలని భావిస్తుంటాను. కొన్ని రోజులు ఎంతో కఠినంగా ఉంటాయి. మరికొన్ని రోజులు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఏదీ ఏమైనా నా గేమ్ను నేను ఆడుతుంటా. మిగిలిన విషయాలను పెద్దగా పట్టించుకోను. నా మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండవు.” అంటూ జైస్వాల్ సమాధానం ఇచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (65), నేహాల్ వధేరా (49) లు రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ ఐదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం యశస్వి జైస్వాల్ (104నాటౌట్) అజేయ మెరుపు సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది.
Yashasvi Jaiswal : ఐపీఎల్లో చరిత్రలో జైస్వాల్ అరుదైన ఘనత.. కోహ్లి సరసన!