Yashasvi Jaiswal : ఐపీఎల్లో చరిత్రలో జైస్వాల్ అరుదైన ఘనత.. కోహ్లి సరసన!
ఐపీఎల్ 17వ సీజన్లో ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ అందుకున్నాడు.
Yashasvi Jaiswal century : ఐపీఎల్ 17వ సీజన్లో ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ అందుకున్నాడు. సోమవారం జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. జైస్వాల్ విజృంభణతో రాజస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ (63; 45 బంతుల్లో 5 ఫోర్లు, 3సిక్సర్లు), నెహాల్ వదేరా (49; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం జైస్వాల్ (104 నాటౌట్; 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ శతకంతో అదరగొట్టడంతో లక్ష్యాన్ని రాజస్థాన్ 18.4 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి ఛేదించింది. కాగా.. ఐపీఎల్లో జైస్వాల్ ఇది రెండో సెంచరీ.
పలు రికార్డులు బద్దలు కొట్టిన జైస్వాల్..
ముంబై పై శతక్కొట్టిన జైస్వాల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 23 ఏళ్ల లోపు రెండు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 22 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు తాను చేసిన రెండు శతకాలు ముంబై పైనే చేయడం విశేషం. 21 ఏళ్ల 123 రోజుల వయసులో 2023లో వాంఖడే ముంబై మొదటి సెంచరి చేశాడు. ఇప్పుడు 22 ఏళ్ల 116 రోజుల వయసులో ఇంకో శతకం బాదాడు.
ఒకే జట్టు పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ముంబై పై రాహుల్ ఏకంగా మూడు శతకాలు బాదాడు. ఆ తరువాత క్రిస్ గేల్ పంజాజ్ పై, విరాట్ కోహ్లి గుజరాత్ పై, డేవిడ్ వార్నర్ కోల్కతా పై, జోస్ బట్లర్ కేకేఆర్, ఆర్సీబీ లపై రెండేసి శతకాలు బాదారు. ఇప్పుడు వీరితో కలిసి జైస్వాల్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు.
T20 World Cup 2024 : టీమ్ఇండియా టీ20ప్రపంచకప్ ప్రొమో చూశారా..? గూస్ బంప్స్ రావడం పక్కా!