Neeraj Chopra
Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది. భారత్కు 6 పతకాలు వచ్చాయి. ఇందులో ఒకటి రజతం కాగా మరో ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది భారత అథ్లెట్లు స్వదేశానికి చేరుకోగా మిగిలిన వారు నేడు (మంగళవారం ఆగస్టు 13న) రానున్నారు. అయితే.. ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా మాత్రం భారత్కు రావడం లేదు. అతడు జర్మనీకి వెళ్లాడు.
నీరజ్ చోప్రా పూర్తి ఫిట్గా లేడు. అతడు గాయంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో శస్త్రచికిత్స చేయించుకోవాలా..? రాబోయే డైమండ్ లీగ్లో పాల్గొనాలా వద్దా..? అనేది నిర్ణయించుకోవడం కోసం జర్మనీ వైద్యుల సలహా తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మరో 45 రోజులు అతడు భారత్కు తిరిగి వచ్చే అవకాశం లేనట్లుగా అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భారత ఒలింపిక్ సంఘం వర్గాలు కూడా చోప్రా జర్మనీకి వెళ్లినట్లు ధృవీకరించాయి.
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ పతక వీరులపై కాసుల వర్షం.. ఎవరికి ఎంతంటే..?
నీరజ్ చోప్రా జర్మనీ వెళ్లిపోయాడు. మరో నెలన్నర రోజులు అతడు భారత్కు వచ్చే అవకాశం లేదు. నాకు పూర్తి పూర్తి వివరాలు తెలియదు. గానీ వైద్యులను సంప్రదించడానికే నీరజ్ అక్కడకు వెళ్లాడు. ఇక అతడు డైమండ్ లీగ్లో పాల్గొనాలా..? వద్దా అనే విషయాలను కోచ్, ఫిజియో నిర్ణయిస్తారు అని నీరజ్ కుటుంబ సభ్యుడు ఒకరు పిటీఐకి తెలిపారు.
2023లో గజ్జ గాయంతో బాధపడుతూనే నీరజ్ ప్రపంచ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. ఈ సంవత్సరం పారిస్ ఒలింపిక్స్కు ముందు, అడిక్టర్ కండరాల నిగ్ల్ కారణంగా ఒక నెల కంటే ఎక్కువ విరామం తీసుకున్నాడు. 26 ఏళ్ల చోప్రా తన గాయం గురించి గతంలో జర్మనీలోని వైద్యుడిని కూడా సంప్రదించాడు. ఈ ఒలింపిక్స్కు ముందు కొన్ని రోజుల పాటు జర్మనీలోని సార్బ్రూకెన్లో శిక్షణ పొందాడు.
IND vs BAN : బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్.. భారత్కు ఒక గుడ్న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్..!
ఇదిలా ఉంటే.. బెల్జియంలోని బ్రస్సెల్స్లో డైమండ్ లీగ్ ఫైనల్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ ఫైనల్లో ఆడాలని అనుకుంటున్నట్లుగా నీరజ్ గతంలో తెలిపాడు. ఈ సీజన్లో నీరజ్ మే 10న దోహాలో జరిగిన డైమండ్ లీగ్లో మాత్రమే ఆడాడు. అక్కడ రెండో స్థానంలో నిలిచాడు. ఈ లీగ్ ఫైనల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ అతడు ఫైనల్ ఆడాలని అనుకున్నట్లయితే మరో డైమండ్ లీగ్లో ఆడాల్సి ఉంటుంది. తొలి ఆరు స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్లో తలపడతారు.