Paris Olympics 2024 Day 11
Paris Olympics 2024 Day 11 : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ అథ్లెట్స్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. తొలుత నాలుగు రోజుల్లో మూడు పతకాలు దక్కించుకోగా.. ఆ తరువాత నుంచి ఒక్క పతకాన్నికూడా కైవసం చేసుకోలేక పోయారు. కచ్చితంగా పతకం వస్తుందని ఆశపెట్టుకున్న బ్యాడ్మింటన్ యువ సంచలనం లక్ష్యసేన్ సైతం పతకం లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. పదోరోజు (ఆగస్టు 5) భారత్ ఆశలు నిరాశే అయ్యాయి. లక్ష్యసేన్ పతకం సాధించకుండానే నిష్క్రమించడంతోపాటు.. షూటింగ్ లో మహేశ్వరి, అనంత్ జీత్ జంట పాయింట్ తేడాతో కాంస్య పతకానికి దూరమైంది. మరోవైపు గట్టి పట్టుతో ఆకట్టుకున్న రెజ్లర్ నిషా ఓటమి పాలైంది. ఒలంపిక్స్ ప్రారంభమై పదిరోజులు అయినా కేవలం మూడు పథకాలతోనే భారత్ 59వ స్థానంలో ఉంది. దీంతో నాల్గో పతకం ఎప్పుడు వస్తుందా అని భారత్ క్రీడాభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Also Read : Paris Olympics : నీరజ్చోప్రా బరిలోకి దిగేది ఎప్పుడంటే..? మొబైల్లో ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా 11వ రోజు (మంగళవారం) ప్రధాన ఈవెంట్లు ఉన్నాయి. వరుసగా రెండో ఒలింపిక్ పతకంపై కన్నేసిన భారత్ పురుషుల హాకీ జట్టు ఇవాళ కీలక సమరానికి సిద్ధమైంది. సూపర్ ఫామ్ లో ఉన్న హర్మన్ ప్రీత్ సేన మంగళవారం జరిగే సెమీఫైనల్లో జర్మనీని ఢీకొట్టనుండి. జర్మనీపై గెలిస్తే కనీసం రజతం ఖాయమవుతుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 10.30 గంటలకు జరుగుతుంది. భారత్ లోని క్రీడాభిమానుల చూపంతా నీరజ్ చోప్రా వైపు ఉంది. ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా ఇవాళ బరిలోకి దిగనున్నాడు. ఈసారి నీరజ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇవాళ జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే గురువారం జరిగే ఫైనల్స్ నీరజ్ చోప్రా ఆడే అవకాశం ఉంటుంది. మరోవైపు మహిళల రెజ్లింగ్ 50కేజీల ప్రిక్వార్టర్స్ లో జంపాన్ క్రీడాకారిణి సుసాకీతో వినేశ్ ఫోగట్ తలపడనుంది. ఈ మూడు ప్రధాన ఈవెంట్లేకాక.. భారత్ తరపున అథ్లెట్స్ పలు విభాగాల్లో ఇవాళ పోటీపడబోతున్నారు.
ఈరోజు (ఆగస్టు 6) భారత షెడ్యూల్..
టేబుల్ టెన్నిస్ :
పురుషుల టీమ్ ప్రీక్వార్టర్స్ (భారత్ వర్సెస్ చైనా) మధ్యాహ్నం 1.30గంటలకు.
మహిళల టీమ్ క్వార్టర్స్ (భారత్ వర్సెస్ అమెరికా లేదా జర్మనీ) సాయంత్రం 6.30గంటలకు.
అథ్లెటిక్స్..
మధ్యాహ్నం 1:50 గంటలకు పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ Aలో కిషోర్ జెనా పాల్గొంటాడు.
మధ్యాహ్నం 3:20 గంటలకు పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ Bలో నీరజ్ చోప్రా పాల్గొంటాడు.
మధ్యాహ్నం 2.50 గంటలకు మహిళల 400 మీటర్ల రెపెచేజ్ రౌండ్ లో కిరణ్ పహల్ పోటీపడుతుంది.
రెజ్లింగ్ :
మధ్యాహ్నం 2:30 గంటలకు మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల రౌండ్ ఆఫ్ 16లో వినేష్ ఫోగట్ జపాన్ క్రీడాకారిణి యుయి సుసాకితో తలపడనుంది.
అర్హత సాధిస్తే.. సాయంత్రం 4:20 గంటలకు వినేష్ ఫోగాట్ మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో పోటీపడుతుంది.
ఇందులోనూ విజయం సాధిస్తే రాత్రి 10.25గంటలకు వినేశ్ ఫోగట్ మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల సెమీఫైనల్లో పాల్గొంటుంది.
హాకీ :
రాత్రి 10.30 గంటలకు పురుషుల సెమీస్ లో (భారత్ వర్సెస్ జర్మనీ) జట్లు తలపడనున్నాయి.
అథ్లెటిక్స్ :
మహిళల లాంగ్ జంప్ క్వాలిఫికేషన్ మధ్యాహ్నం 2.45 గంటలకు.
పురుషుల 400 మీటర్ల పరుగు సెమీస్ రాత్రి 11.05గంటలకు