PCB Suffers huge Loss In Champions Trophy Report
చాలా కాలం తరువాత స్వదేశంలో ఓ ఐసీసీ మెగా టోర్నీని నిర్వహించామన్న ఆనందం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కు ఏ మాత్రం లేకుండా పోయింది. టోర్నీ ఆరంభం నుంచి అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఓడిపోయి గ్రూప్ దశ నుంచే ఆ జట్టు నిష్ర్కమించింది. దీంతో పీసీబీ పై మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున విమర్శించారు.
ఇక దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం టోఫ్రీ ప్రెజెంటేషన్ సెర్మనీలో పాక్ ప్రతినిధులను పోడియం పైకి ఆహ్వానించలేదు. దీనిపై పాక్ తన అసంతృప్తిని వ్యక్తం చేయగా, ఐసీసీ తగిన కారణాలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీతో లాభాలు పొందాలని భావించిన పాక్కు చాలా పెద్ద షాక్ తగిలినట్లు తెలుస్తోంది. వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ మెగా టోర్నీలో ఆతిథ్య దేశం అయిన పాకిస్తాన్ స్వదేశంలో ఒకే ఒక మ్యాచ్ ఆడింది. లాహోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఆ మ్యాచ్లో పాక్ ఓడిపోయింది. ఆ తరువాత దుబాయ్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లోనూ చిత్తైంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఒక్క విజయం లేకుండానే డిఫెండింగ్ ఛాంపియన్ అయిన పాక్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
రూ.740 కోట్ల నష్టం..
ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం ద్వారా పాకిస్తాన్ కు దాదాపు రూ.740 కోట్ల నష్టం వచ్చినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ మెగాటోర్నీ కోసం పాకిస్తాన్ 18 బిలియన్ల పాకిస్తాన్ రూపాయల(సుమారు 58 మిలియన్లు డాలర్లు)ను ఖర్చుచేసినట్లు పేర్కొన్నాయి. కరాచీ, రావల్సిండి, లాహోర్ వేదికగాను ఆధునీకరించడానికి ఈ నిధులను వెచ్చించింది. ఇది అంచనా వేసిన వ్యయం కంటే దాదాపు 50 శాతం ఎక్కువ.
Ashwin : ‘నా వందో టెస్టుకు ధోనిని పిలిస్తే రాలేదు.. అయితే..’ అశ్విన్ కామెంట్స్ వైరల్..
దీనితో పాటు ఈవెంట్ సన్నాహాల కోసం మరో 40 మిలియన్ల డాలర్లను ఖర్చు చేసింది. అయితే.. ఆతిథ్య హక్కుల కింద పీసీబీ కేవలం 6 మిలియన్ల డాలర్లు మాత్రమే అందినట్లు సమాచారం. ఇక టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్ షిప్ల ద్వారా కూడా చాలా తక్కువ మొత్తం ఆదాయమే వచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాక్ క్రికెట్ బోర్డు 85 మిలియన్ల డాలర్లు నష్టపోయినట్లు నివేదిక తేల్చింది. ఈ క్రమంలో ఈ భారీ నష్టాన్ని పూడ్చుకునేందుకు పీసీబీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో భారీ కోతను విధించింది. నేషనల్ టీ20 ఛాంపియన్ షిప్లో ఆడే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 90శాతం, రిజర్వ్ ఆటగాళ్లకు 87.5 శాతం కోత పెట్టనుందట.