IPL 2024 centuries : కోహ్లి నుంచి జైస్వాల్ వరకు.. ఈ సీజన్లో ఇప్పటి వరకు సెంచరీలు కొట్టిన ఆటగాళ్లు..
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని జట్లు సగం మ్యాచులను ఆడేశాయి.
- Thota Vamshi Kumar
- Published on- April 23, 2024 / 03:58 PM IST
Seven centurions so far in IPL 2024 season after complete 38 matchs
Seven centurions so far in IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని జట్లు సగం మ్యాచులను ఆడేశాయి. ఇప్పటి వరకు 38 మ్యాచులు పూర్తి అయ్యాయి. బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. గత 11 ఏళ్లు పదిలంగా ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోరు ఈ సీజన్లో మూడు సార్లు బద్దలైందంటే బ్యాటర్లు ఏ స్థాయిలో విజృంభిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
సోమవారం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అజేయ శతకంతో తన జట్టుకు విజయాన్ని అందించాడు. 59 బంతుల్లోనే అతడు మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో అతడు 60 బంతులను ఎదుర్కొని 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో తొమ్మిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.
Yashasvi Jaiswal : ఐపీఎల్లో చరిత్రలో జైస్వాల్ అరుదైన ఘనత.. కోహ్లి సరసన!
జైస్వాల్ కొట్టిన సెంచరీ ఈ సీజన్లో ఏడో శతకం కావడం విశేషం. అతడి కంటే ముందు విరాట్ కోహ్లి, సునీల్ నరైన్, జోస్ బట్లర్, రోహిత్ శర్మ, ట్రావిస్ హెడ్ లు శతకాలు బాదారు. బట్లర్ ఈ సీజన్లో రెండు సెంచరీలు బాదాడు.
ఈ సీజన్లో నమోదైన సెంచరీలు ఇవే..
1) విరాట్ కోహ్లి (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 72 బంతుల్లో 113 నాటౌట్ – జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ పై
2) జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్) – 58 బంతుల్లో 100 నాటౌట్ – జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై
3) రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) – 63 బంతుల్లో 105 నాటౌట్ – వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ పై
4) ట్రావిస్ హెడ్ (సన్రైజర్స్ హైదరాబాద్) – 41 బంతుల్లో 102 – చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై
5) సునీల్ నరైన్ (కోల్కతా నైట్రైడర్స్) – 56 బంతుల్లో 109 – ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ పై
6) జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్) – 60 బంతుల్లో 107 నాటౌట్ – ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్ పై
7) యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్) – 60 బంతుల్లో 104 నాటౌట్ – జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్ పై
పాయింట్ల పట్టికలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే..?
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచులు ఆడగా ఏడింటిలో విజయాలు సాధించింది. ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఆ తరువాత వరుసగా కేకేఆర్, ఎస్ఆర్హెచ్, చెన్నై, లక్నో, గుజరాత్, ముంబై, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ లు ఉన్నాయి.
