U19 World Cup 2024 : మరోసారి సెమీఫైనల్లోనే ఓడిన దక్షిణాఫ్రికా.. కన్నీళ్లు పెట్టుకున్న ఆటగాళ్లు
పాపం దక్షిణాఫ్రికా.. మరోసారి సెమీ ఫైనల్లోనే ఓడిపోయింది.
పాపం దక్షిణాఫ్రికా.. మరోసారి సెమీ ఫైనల్లోనే ఓడిపోయింది. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా చేతిలో సెమీ ఫైనల్ మ్యాచులో ఓడిపోగా.. తాజాగా స్వదేశంలో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్లో సైతం భారత్ చేతిలో ఓడిపోయి సెమీఫైనల్ నుంచే నిష్క్రమించింది.
స్వదేశంలో ప్రపంచకప్ను సాధించాలని టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్ జట్టుతో మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచి సెమీఫైనల్కు చేరుకుంది. అయితే.. ఇక్కడ సఫారీలకు భంగపాటు తప్పలేదు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో భారత్ చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో సఫారీ ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా.. ఓటమి బాధలో ఉన్న సపారీ కెప్టెన్ జువాన్ జేమ్స్ను భారత కెప్టెన్ ఉదయ్ సహరాన్ ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాప్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో లువాన్ డ్రి ప్రిటోరియస్ (76), రిచర్డ్ సెలెట్స్వేన్ (64) హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో లింబాని మూడు, ముషీర్ ఖాన్ రెండు వికెట్లు తీశారు. సౌమి పాండే, నమన్ తివారీ లు చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యాన్ని భారత్ 48.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో సచిన్ దాస్ (96; 95 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. కెప్టెన్ ఉదయ్ సహారన్ (81; 124 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫాకా, ట్రిస్టన్ లూస్ లు చెరో మూడు వికెట్లు తీశారు.
స్టంప్ మైక్లో రోహిత్ మాటలు రికార్డు.. మైదానంలో టీమ్ఇండియా ఆటగాళ్లను హిట్మ్యాన్ ఏమన్నాడంటే ?
South Africa losing yet another Semi Finals…!!! 💔 pic.twitter.com/JnpbvcgitO
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2024