కొత్త శకం ప్రారంభం.. సచిన్-అండర్సన్ ట్రోఫీ ఆవిష్కరణ.. టెండూల్కర్ ఆసక్తికర కామెంట్స్.. బీసీసీఐ, ఈసీబీ కీలక నిర్ణయం..
ఇకపై సిరీస్ గెలిచిన జట్టు కెప్టెన్కు "పటౌడి మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్" అందజేస్తారు.

Anderson-Tendulkar
భారత్-ఇంగ్లాండ్ క్రికెట్ సంబంధాలలో ఒక కొత్త శకం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక టెస్ట్ సిరీస్కు అధికారికంగా “అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ” అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన ట్రోఫీని ఇవాళ ఆవిష్కరించారు.
క్రికెట్ చరిత్రలోని ఇద్దరు దిగ్గజాలు జేమ్స్ అండర్సన్, సచిన్ టెండూల్కర్కు దక్కిన ఈ అరుదైన గౌరవంపై సచిన్ స్పందించారు. ఈ విషయం తెలియగానే తాను మొదట పటౌడి కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడానని, వారి వారసత్వానికి ఎలాంటి లోటు రాకుండా చూస్తానని హామీ ఇచ్చానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పటౌడి వారసత్వానికి పెద్దపీట: సచిన్ పెద్ద మనసు
ఈ ట్రోఫీకి తన పేరు పెట్టడంపై సచిన్ ఆనందం వ్యక్తం చేస్తూనే పటౌడి కుటుంబం పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు. “నాకు అందిన ఈ గౌరవం గురించి తెలిసిన వెంటనే నేను పటౌడి కుటుంబంతో మాట్లాడాను. వారి వారసత్వాన్ని ఎలా కొనసాగించాలనే దానిపై చర్చించాను” అని సచిన్ తెలిపారు.
సచిన్ సూచన మేరకు బీసీసీఐ, ఈసీబీ కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై సిరీస్ గెలిచిన జట్టు కెప్టెన్కు “పటౌడి మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్” అందజేస్తారు.
“టైగర్ పటౌడి గొప్ప నాయకత్వానికి ప్రతీక. అందుకే ఆయన పేరు మీద నాయకుడికి మెడల్ ఇవ్వడం సరైన గౌరవం” అని సచిన్ వివరించారు.
అలాగే, తనకు లభించిన ఈ అరుదైన గౌరవంపై సచిన్ తన మనసులోని మాటను పంచుకున్నారు. “టెస్ట్ క్రికెట్లో మనం పడిన కష్టానికి దక్కిన గుర్తింపు ఇది. నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపించింది. నేను పొందిన ప్రతి గౌరవాన్ని సమానంగా చూస్తాను, వాటిని మరే విషయంతోనో పోల్చడం నాకు ఇష్టం లేదు. ఇది కూడా అలాంటి గొప్ప గౌరవమే” అని అన్నారు.
టైగర్ పటౌడి గురించి మాట్లాడుతూ.. “ఒక కంటి చూపుతో అంతర్జాతీయ స్థాయిలో ఆడటం అనేది అసాధారణం. ఆయన గురించి విన్న కథలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి” అని గుర్తుచేసుకున్నారు.
టీమిండియాకు సచిన్ సూచన
జూన్ 20న ప్రారంభమయ్యే తొలి మ్యాచ్పై సచిన్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. “కేవలం మాటలతో కాదు, చేతల్లో చూపించాలి. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ అత్యంత కీలకం. ముఖ్యంగా ఇంగ్గాండ్లోని చల్లటి వాతావరణంలో బంతిని గ్రిప్ చేయడం కష్టం. క్యాచ్లు వదిలేస్తే మ్యాచ్ను కోల్పోతాం. ఈ విషయంలో జట్టు చాలా జాగ్రత్తగా ఉండాలి” అని హెచ్చరించారు.
ప్రస్తుత భారత జట్టు సామర్థ్యంపై సచిన్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. “కచ్చితంగా ఈ టీమ్ గెలవగలదు.. ప్రతి జట్టు ఒక సంధికాలాన్ని ఎదుర్కొంటుంది. ఇది సహజమైన ప్రక్రియ. ప్రస్తుత తరం ఆటగాళ్లలో ప్రతిభ ఉంది. వారు సరిగ్గా ప్లాన్ చేసి, అమలు చేస్తే చాలు. ఈ సిరీస్ గెలవడం కష్టమే కానీ, అసాధ్యం మాత్రం కాదు” అని అన్నారు.
“అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ” కేవలం ఇద్దరు ఆధునిక దిగ్గజాలను గౌరవించడమే కాదు, సచిన్ చొరవతో పటౌడి వంటి లెజెండ్ వారసత్వాన్ని కూడా సజీవంగా ఉంచే ఒక గొప్ప ప్రయత్నం. ఇది భారత్-ఇంగ్లండ్ క్రికెట్ బంధంలో ఒక సరికొత్త, గౌరవప్రదమైన అధ్యాయాన్ని లిఖించింది.
Two cricketing icons. One special recognition 🤝
The legendary Sachin Tendulkar and James Anderson pose alongside the new 𝘼𝙣𝙙𝙚𝙧𝙨𝙤𝙣-𝙏𝙚𝙣𝙙𝙪𝙡𝙠𝙖𝙧 𝙏𝙧𝙤𝙥𝙝𝙮 🏆#TeamIndia | #ENGvIND | @sachin_rt | @jimmy9 pic.twitter.com/4lDCFTud21
— BCCI (@BCCI) June 19, 2025