T20 World Cup 2026 : పాక్కు యూఎస్ఏ ప్లేయర్ వార్నింగ్.. మరోసారి ఓడిస్తాం.. మొహ్సిన్ వ్యాఖ్యలు వైరల్
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా మంగళవారం కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా పాకిస్తాన్, యూఎస్ఏ జట్లు తలపడనున్నాయి
USA player Mohammad Mohsin warns Pakistan ahead of T20 World Cup 2026 clash
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా మంగళవారం కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా పాకిస్తాన్, యూఎస్ఏ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ కు ముందు యూఎస్ఏ ఆటగాడు మహ్మద్ మొహ్సిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ పై ఎలాంటి ఒత్తిడి లేదన్నాడు. ప్రస్తుతం పాక్ జట్టుపైనే ఒత్తిడి అంతా ఉందన్నాడు. 2024 టీ20 ప్రపంచకప్ లో తమ చేతిలో ఓడిపోవడమే ఇందుకు కారణం అని చెప్పుకొచ్చాడు.
మ్యాచ్కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మొహ్సిన్ మాట్లాడుతూ.. అప్పటితో పోలిస్తే తమ జట్టు నైపుణ్యం గణనీయంగా మెరుగుపడిందని తెలిపాడు. కాబట్టి మరోసారి పాక్ పై విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు.
‘గత ప్రపంచకప్లో నేను జట్టులో భాగం కాను. కానీ అక్కడే ఉండి మ్యాచ్ను చూశాను. అప్పటికి, ఇప్పటికి తేడా ఏంటంటే.. మా బలం మరింత పెరిగింది. అప్పటితో పోలిస్తే మా నైపుణ్యాలు ఇంకా మెరుగు అయ్యాయి. పాక్ పై మళ్లీ గెలవాలని ఆశిస్తున్నాము. గత ప్రపంచకప్లో ఆ జట్టును ఓడించడంతో మాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. దానితోనే మరోసారి ఆ జట్టుపై గెలుస్తాం.’ అని మొస్సిన్ అన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో జట్టులో చోటు దక్కించుకున్న మొస్సిన్ భారత్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసిన అతడు కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.
సూపర్ ఓవర్లో విజయం..
టీ20 ప్రపంచకప్ 2024లో పాక్ వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ టై అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో అమెరికా కూడా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది.
సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ జట్టు వికెట్ కోల్పోయి 18 పరుగులు చేసింది. అనంతరం 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. దీంతో అమెరికా 5 పరుగుల తేడాతో గెలుపొందింది.
