వరల్డ్ కప్ టోర్నీలో కప్ గెలుచుకునే దిశగా.. ఏ జట్లు ఫేవరేట్గా ఉన్నాయో అనే అంశంపై కోహ్లీ మాట్లాడాడు. బుధవారంతో ముగిసిన వన్డే టోర్నీ ప్రదర్శనతో టీమిండియా ప్రపంచ కప్ టోర్నీ గెలుచుకునేందుకు ఫేవరేట్ కాదని తేల్చేశాడు. దీంతో పాటు మరే జట్టు ఈ టోర్నీకి ఫేవరేట్ టీం కాదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇంగ్లాండ్ గడ్డపై జరగనున్న ఈ టోర్నీలో ప్రతి జట్టు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏ జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగడం లేదు. ప్రతి జట్టు ప్రమాదకరం. ఎవరికైతే ఆ రోజు బాగా కలిసొస్తుందో వాళ్లు కచ్చితంగా రాణిస్తారు. సత్తా ఉన్న జట్టును ప్రపంచ కప్ గెలుచుకోకుండా ఆపడం ఎవరితరం కాదు’
Read Also : రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
‘మీరు చూసే ఉంటారు. వెస్టిండీస్ ఎలా మెరుగవుతుందో.. ఆ జట్టు కూడా వరల్డ్ కప్ లో ప్రమాదకరంగా తయారవుతోంది. ఇంగ్లాండ్ చాలా పటిష్ఠంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు ఇప్పటికే సమన్వయం కుదిరిందని అనుకుంటున్నా. మేము కూడా బాగానే ఆడుతున్నాం. న్యూజిలాండ్ జట్టు బాగుంది. పాకిస్తాన్ జట్టుకు కలిసొస్తే ఆ రోజున ఏ జట్టునైనా ఓడించగలదు’ అని కోహ్లీ ఏ జట్టును కించపరచకుండా.. ఎవ్వరినీ తక్కువ అంచనా వేయొద్దనే ఉద్దేశ్యంతో వివరించాడు.
మే 30 నుంచి ఇంగ్లాండ్లో వరల్డ్ కప్ టోర్నీ ఆరంభ కానుంది. బుధవారం ముగిసిన వన్డేతో టీమిండియా సొంతగడ్డపైనే రెండు ఫార్మాట్లలోనూ రెండు సిరీస్లను పరాజయంతో ముగించింది. విదేశీ పర్యటనను విజయంతో ముగించిన భారత్కు ప్రపంచ కప్కు ముందు స్వదేశంలో చేదు అనుభవం ఎదురైంది.