INDW vs AUSW : భారత్, ఆసీస్ సెమీస్కు వర్షం ముప్పు..? మ్యాచ్ రద్దైతే ఏ జట్టుకు ప్రయోజనం అంటే?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (INDW vs AUSW) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
- Thota Vamshi Kumar
- Published On : October 28, 2025 / 06:59 PM IST
Womens World Cup 2025 What happens if IND-W vs AUS-W semifinal gets washed out
INDW vs AUSW : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో గ్రూప్ స్టేజీ ముగిసింది. ఇక సెమీస్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. బుధవారం జరిగే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు తలపడనుండగా, గురువారం జరిగే రెండో సెమీస్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు (INDW vs AUSW) ఢీ కొట్టనున్నాయి.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో సెమీస్ మ్యాచ్ కోసం నవీముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్ చేరుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే.. ఇరు జట్లకు ఓ బ్యాడ్న్యూస్ ఇది. వర్షం ఈ మ్యాచ్కు అంతరాయం కలిగించవచ్చు.
మ్యాచ్ జరిగే అక్టోబర్ 30న (గురువారం) మధ్యాహ్నం నవీ ముంబైలో వర్షం పడే అవకాశం 69 శాతం ఉంది. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనే టెన్షన్ అభిమానుల్లో ఉంది. ఒకవేళ ఆ రోజు మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఉంటే మరుసటి రోజు అంటే అక్టోబర్ 31న నిర్వహించవచ్చు.
ఎందుకంటే సెమీఫైనల్స్, ఫైనల్కు ఐసీసీ రిజర్వ్ డేలను కేటాయించింది. అయితే.. అంపైర్లు సాధారణంగా షెడ్యూల్ డే రోజుననే మ్యాచ్ను ముగించేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తారు. అప్పటికి కుదరపోతేనే రిజర్వ్డేలో నిర్వహిస్తారు.
IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. మ్యాచ్లను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చొ తెలుసా?
అయితే.. రిజర్వ్ డే అక్టోబర్ 31 కూడా ముంబైలో వర్షం పడే అవకాశాలు ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం అభిమానుల్లో ఉంది. మ్యాచ్ రద్దు అయితే.. ఐసీసీ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. ఆసీస్ గ్రూప్ స్టేజీలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. అంటే మ్యాచ్ రద్దు అయితే ఆసీస్కే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఆసీస్ ఫైనల్లో అడుగుపెడుతుంది.
