షియామీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు డెలివరీ కావాలంటే కస్టమర్లు ఇన్ని నెలల వరకు వేచి ఉండాల్సిందే..
Xiaomi Electric car: మార్చి 28న ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించారు. 24 గంటల్లోనే ప్రీ-ఆర్డర్లు 88,898 వచ్చాయని ఆ కంపెనీ ఇప్పటికే తెలిపింది.
- T Venkateshwarlu
- Published On : April 1, 2024 / 07:23 PM IST
Xiaomi Electric car
చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియామీ తన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ను మార్చి 28న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎస్యూ7 మ్యాక్స్ కారు డెలివరీ కావాలంటే కస్టమర్లు ఆరు నెలల వరకు వేచి ఉండాల్సిందే. ఈ మేరకు ఆ కంపెనీ కస్టమర్లకు అందించిన సమాచారానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సామాజిక మాధ్యమాల్లో కనపడుతున్నాయి.
డెలివరీకి దాదాపు 27 వారాలు పట్టవచ్చని అందులో కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. మార్చి 28న ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించిన 24 గంటల్లోనే ప్రీ-ఆర్డర్లు 88,898 వచ్చాయని ఆ కంపెనీ ఇప్పటికే తెలిపింది. డెలివరీలో జాప్యం గురించి ఆ సంస్థ స్పందించడం లేదు.
షియామీ దాదాపు 12 శాతం మార్కెట్ వాటాతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్మార్ట్ఫోన్ల అమ్మకందారుగా ఉంది. ఈ కారు ధర ధర సుమారు రూ.24.90 లక్షలు (2,15,900 యువాన్లు). టెస్లాతో పాటు బీవైడీ సంస్థల కార్ల నుంచి వచ్చే పోటీని ఎదుర్కొనేందుకు వీలైనంత తక్కువ ధరకు ఈ కారును విక్రయిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఎస్యూ7 కార్లలో మొత్తం నాలుగు వేరియంట్లను షియామీ గత గురువారం విడుదల చేసింది. ఈ కార్లను ఒకసారి ఛార్జింగ్ చేస్తే 819 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు.
