Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్ ఘటనలో రాష్ట్రానికి కేంద్రం మరో లేఖ..
మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరో లేఖ రాసింది. కేంద్ర జలశక్తి శాఖ కమిటీ ప్రాజెక్టు ఆదివారంలోగా ఘటనపై తాము కోరిన సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది.
- Harishth Thanniru
- Published On : October 28, 2023 / 12:45 PM IST
medigadda barrage
Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరో లేఖ రాసింది. కేంద్ర జలశక్తి శాఖ కమిటీ ప్రాజెక్టు ఆదివారంలోగా ఘటనపై తాము కోరిన సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు తర్వాత బ్యారేజీని జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ ఆధ్వర్యంలోని కేంద్ర బృందం ఈనెల 23 నుంచి 26 వరకు సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత సమాచారం ఇచ్చింది. అయితే, కమిటీ తిరుగు పయణంలో వారు అడిగిన మరికొన్ని వివరాలు ఇవ్వకపోవడంతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసినట్లు తెలిసింది.
మేడిగడ్డ బ్యారేజీ ఘటనలో మొత్తం 20 అంశాల సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు అంశాలపై మాత్రమే వివరాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన అంశాలపై పాక్షిక సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే, మిగిలిన అంశాలపైకూడా పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఆదివారంలోగా సమాచారం ఇవ్వకుంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లు లేనట్లుగా భావిస్తామని, ఆ మేరకు తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించింది.
