భారత రక్షణరంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కరోనాపై పోరుకు అస్త్రాలను తయారు చేస్తున్నది.
భారత రక్షణరంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కరోనాపై పోరుకు అస్త్రాలను తయారు చేస్తున్నది. రోగులు, వైద్య సిబ్బంది కోసం కీలకమైన మాస్క్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లు, బాడీసూట్లను రూపొందిస్తున్నామని డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. వాటికోసం ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాలు తమను సంప్రదించాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు కంపెనీలతో కలిసి భారీస్థాయిలో వాటిని తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని సతీశ్రెడ్డి తెలిపారు.
‘ప్రస్తుతం మార్కెట్లో ఎన్-95 మాస్కులు లభిస్తున్నాయి. మేము మోనో మెస్ బేస్డ్ ఫిల్టర్ ఉపయోగించి ఐదు లేయర్లతో ఎన్-99 మాస్కులను అభివృద్ధి చేశాం. ఇవి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. ధర ఎన్-95 కంటే కాస్త ఎక్కువైనప్పటికీ పనితీరు బాగుంటుంది. మూడు నాలుగు రోజుల్లో లక్ష ఎన్-99 మాస్కులను అందుబాటులోకి తెస్తాం. బీహెచ్ఈఎల్తో కలిసి వెంటిలేటర్లను అభివృద్ధిచేశాం. మూడువారాల్లో ఐదువేల వెంటిలేటర్లను అందిస్తాం. నెలకు పదివేల నుంచి 20వేల వరకు అందుబాటులోకి తెస్తాం’ అని సతీశ్రెడ్డి వివరించారు.
వివిధ రాష్ట్రాల్లో ఉన్న డీఆర్డీవో పరిశోధనశాలల్లో శానిటైజర్లను తయారుచేస్తున్నాం. ఇప్పటికే సైన్యానికి 25 వేల బాటిల్స్ వరకు పంపిణీ చేశాం. రోజుకు 20 నుంచి 30 వేల లీటర్ల వరకు ఉత్పత్తి చేస్తున్నాం. పార్లమెంట్కు, ఇతర రక్షణ విభాగాలకు అందించాము. కరోనా రోగులను ఉంచే వార్డుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సుల కోసం బాడీ సూట్లను కూడా తయారుచేస్తున్నాం. డిఫెన్స్ అవసరాల కోసం అభివృద్ధి చేసిన సూట్లను ప్రస్తుత అవసరాల కోసం కొన్ని మార్పులు చేసి వేల సంఖ్యలో అందుబాటులోకి తెస్తున్నాం’ అని సతీశ్రెడ్డి వెల్లడించారు.