అయ్యో కరోనా ఎంత పని చేసింది..జనరల్ బజార్ వెలవెల

హ్యాండ్ ఖర్చిఫ్ నుంచి డిజైనర్ వేర్ వరకూ అక్కడ తెగ చీపుగా దొరుకుతాయి. అందుకే ఆ బజార్లో కళ్ల ముందే కోట్ల వ్యాపారం కామ్గా జరిగిపోతూ ఉంటుంది. అయితే అలాంటి వ్యాపారం ఇపుడు కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుపోయి విలవిల్లాడుతోంది. నిత్యం కస్టమర్లతో కళకళలాడే ఆ బజార్ ఇపుడు ఇపుడు వెలవెలబోతోంది. ఇంతకీ ఆ బజార్ ఎక్కడుంది? కోట్ల వ్యాపారాన్ని కరోనా ఎలా కొల్లగొట్టింది?
ఏళ్ల చరిత్ర.. సికింద్రాబాద్లోని జనరల్ బజార్ సొంతం. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారాలకు ఫేమస్. నిత్యం వేలాదిమంది కస్టమర్లతో ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడే జనరల్ బజార్కు కరోనా వైరస్ టెన్షన్ పట్టుకుంది. వందల కోట్ల వ్యాపారం సాగే ఈ బజార్లో చాపకింద నీరులా విస్తరిస్తూ గట్టి దెబ్బే కొట్టింది. నిత్యం కస్టమర్లతో కళకళలాడే జనరల్ బజార్ను నిర్మానుష్యంగా మార్చేసింది. వ్యాపారాలన్నీ ఘోరంగా దెబ్బతిని జనరల్ బజార్ వ్యాపారాన్ని మొత్తం కుదేలు చేసేసింది.
See Also | హమ్మయ్య.. ఎవరికీ కరోనా లేదు, కరీంనగర్లో 76వేల మందికి స్క్రీనింగ్
కావాల్సిన దుస్తులే కాదు.. బెల్టులు, వంటింటి వస్తువులు, వెండి, బంగారం ఇలా అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్తో జనాలు రోడ్ల పైకి రాకపోవడంతో చిరు వ్యాపారులే కాదు పెద్ద వ్యాపారులు అల్లాడుతున్నారు. ఇన్నేళ్లుగా ఎప్పుడూ తమ వ్యాపారానికి ఇంత ఇబ్బంది లేదని చరిత్రలో మొదటిసారిగా పెద్ద మొత్తంలో నష్టం వచ్చి పడిందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహమ్మారి భయంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. దీంతో జనరల్ బజార్కు పది మంది కూడా రావడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం సాగిస్తున్నామని.. గతంలో నిత్యం కస్టమర్లు వచ్చేవారని.. వైరస్ దెబ్బ జనరల్ బజార్పై పడిందని బిబినెస్ తగ్గిందని ఇక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు కరోనా ప్రభావం ఎక్కువ అవుతూ ఉండటంతో ఇక్కడి వ్యాపారులు డీలా పడిపోతున్నారు. ఈ మహమ్మారి ప్రభావంతో భవిష్యత్లో మరెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో అని తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి కరోనా జనరల్ బజార్ చరిత్రను అల్లకల్లోలం చేసిందని వాపోతున్నారు.
Read More : కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ : మోడీకి సూచనలిచ్చిన కేసీఆర్