Corona Effect : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు కరోనా సెగ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కరోనా సెగ తగిలింది. కరోనా ఆంక్షలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడంతో మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది.

Corona Effect
Corona effect on Municipal Election : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కరోనా సెగ తగిలింది. ఓవైపు రాష్ట్రంలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటం.. ముఖ్యమంత్రితో సహా అనేక ప్రముఖ మంత్రలు కరోనా బారిన పడటం.. కరోనా ఆంక్షలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడంతో మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది.
వీకెండ్ లాక్డౌన్ లేదా కర్ఫ్యూపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో… ఈ నెల 23న ప్రభుత్వం కోర్టుకు తన అభిప్రాయాన్ని చెప్పనుంది. ఒకవేళ లాక్డౌన్ విధించాలని హైకోర్టు ఆదేశిస్తే… మున్సిపల్ ఎన్నికలకు కచ్చితంగా బ్రేక్ పడుతుంది. ఎన్నికలు వాయిదా వేయాలని ఇప్పటికే కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కోర్టును ఆశ్రయించారు. షబ్బీర్ విజ్ఞప్తిని పరిశీలించాలని కోర్టు.. ఎస్ఈసీకి సూచించింది.
ఈ నెల 30న ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగిసింది. సాగర్ సభలో పాల్గొన్న కేసీఆర్ సహా పలువురు నేతలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. షర్మిల దీక్షలో పాల్గొన్న నేతలకూ కరోనా సోకింది. ఈ నేపథ్యంలో రాజకీయ సభలు, కార్యక్రమాలతో కరోనా వ్యాపిస్తుందని విమర్శలు వెల్లువెత్తున్నాయి.