మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్.. టికెట్ రేట్ల తగ్గింపు.. ఎంత తగ్గించారంటే..
మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల పెంచిన ఛార్జీలను తగ్గిస్తూ ఎల్ అండ్ టీ మెట్రో నిర్ణయం తీసుకుంది.

Hyderabad Metro
Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల పెంచిన ఛార్జీలను తగ్గిస్తూ హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలపై 10శాతం తగ్గించింది. ఈ నిర్ణయాన్ని ఈనెల 24వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ప్రయాణికులపై పడుతున్న భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, మెట్రోలో ప్రయాణిస్తున్న అల్పాదాయ ప్రజలపై భారం పడకూడదని పెరిగిన చార్జీలపై 10శాతం తగ్గించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఇటీవల కనీసం ఛార్జీ రూ. 10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మెట్రో రైలు ఛార్జీల పెంపు నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చార్జీల పెంపు నగరవాసులపై, ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు మెట్రో చార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఉప్పల్ మెట్రో రైలు డిపో వద్ద వామపక్షాల నేతలు ధర్నాకు దిగారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన మెట్రో రైల్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ఇటీవల పెంచిన ఛార్జీల్లో 10శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.