ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చటానికి వీల్లేదు : హైకోర్టు

  • Published By: veegamteam ,Published On : September 17, 2019 / 05:28 AM IST
ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చటానికి వీల్లేదు : హైకోర్టు

Updated On : September 17, 2019 / 5:28 AM IST

తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండవ సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంది. కొత్త అసెంబ్లీ కట్టాలని తీసుకున్న నిర్ణయం..ఆదిశగా సాగుతున్న చర్యలు వివాదంగా మారి కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో అసెంబ్లీ నిర్మాణం కోసం వారసత్వ సంపదల్ని కూల్చటానికి వీల్లేదంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైక్టోర్టు స్పష్టంచేసింది. 
అసెంబ్లీ నిర్మాణం కోసం..150 ఏళ్ల చరిత్ర ఉన్న ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భనవ నిర్మాణం కోసం కేబినెట్  తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. వారసత్వ కట్టడాల పరిధిలోకి వచ్చే ఎర్రమంజిల్ వారసత్వ భవనాన్ని కూల్చే విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని..నిబంధలను పట్టించుకోకుండా దుందుడుకు నిర్ణయాలు తీసుకుందని కోర్టు వ్యాఖ్యానించింది. 
 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్..జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం (సెప్టెంబర్ 16)న 111 పేజీల తీర్పును వెలువరించింది. ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ను కూల్చివేసి..అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డెక్కన్‌ ఆర్కియాలజికల్‌ అండ్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌‌కు చెందిన జితేంద్రబాబు, ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ నిర్మించిన నవాబు వారసుడు డాక్టర్‌ మిర్‌ ఆస్గార్‌ హుస్సేన్ లతో పాటు సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ జె.శంకర్‌ లతో పాటు మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా 8 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు విచారణ చేపట్టిన సందర్భంగా ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ కూల్చివేత నిర్ణయం తీసుకునే ముందు హెచ్‌ఎండీఏ నుంచి ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని..ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ విషయంలో ప్రభుత్వం హెచ్‌ఎండీఏ చట్టాన్ని పట్టించుకోలేదనే న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈక్రమంలో పట్టణాభివృద్ధి చట్టంలోని సెక్షన్‌ 59 ప్రకారం.. నిబంధన 13 తొలగింపు అధికారం హెచ్‌ఎండీఏకు మాత్రమే ఉందని కోర్టు వెల్లడించింది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తన తెలిపింది.కాగా..100 కోట్ల ఖర్చుతో కొత్త అసెంబ్లీ నిర్మాణానికి సీఎం కేసీఆర్ జూన్ 27 న శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.