Hyderabad Fire Accident
Hyderabad Fire Accident : హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం సమయంలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులతోపాటు వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యారు. అయితే, శనివారం అర్థరాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యం కాలేదు. తాజాగా ఆదివారం ఉదయం ఐదు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. ఈ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Also Read : Raja Singh: ఆ తప్పు వల్లే ఇంత ఘోర అగ్నిప్రమాదం..! నాంపల్లి ఘటనపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
అగ్నిప్రమాదం జరిగిన సమయం నుంచి మంటలను అదుపులోకి తెచ్చేందుకు, లోపల చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తతీసుకొచ్చేందుకు 200 మంది సిబ్బంది 22 గంటలకుపైగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. అయితే, పొగ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా ప్రయత్నించారు. ఇందుకోసం వారు ఆక్సిజన్ సిలిండర్ తో సెల్లార్ లోకి వెళ్లారు. వీరివెంట వైద్య సిబ్బంది కూడా వెళ్లారు.
భవనం సెల్లార్ లో ఐదు మృతదేహాలను సిబ్బంది గుర్తించి బయటకు తీసుకొచ్చారు. తొలుత ఒక మృతదేహం లభ్యంకాగా అది గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో డీఎన్ఎ టెస్టుకు అధికారులు తరలించారు. మరో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత కొద్దిసేపటికే మరో మూడు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.