రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ, అవమానాన్ని భరించరని తెలిపారు. మోసగాళ్లను, మాట ఇచ్చిన తప్పినవారిని అంతిమంగా ప్రజలు బొంద పెడతారని హెచ్చరించారు. రుణమాఫీ నిబంధనలపై ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
నిబంధనల పేరిట రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టిందని అన్నారు. రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరి తాళ్లుగా మారతాయని చెప్పారు. ప్రజలను రాజకీయ పార్టీలు, నేతలు మోసం చేయాలని చూస్తారని గతంలో సీఎం రేవంత్ అన్నారని తెలిపారు. ప్రజల ఆలోచన పట్ల రేవంత్ రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు.
ప్రజల నమ్మకాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోల్పోయారని చెప్పారు. ఐదేళ్లు అధికారం ఇస్తే ఇష్టం వచ్చినట్లు చేయొచ్చని రేవంత్ భావిస్తున్నారని తెలిపారు. గతంలో విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఏడు నెలల నుంచి రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో చిత్తుకాగితంతో సమానమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇతర పార్టీల ఎమ్మెల్యేల మీద ఉన్న ద్యాస.. ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు.
Also Read: అలాగైతే నేను రాజీనామా చేస్తాను: హరీశ్ రావు