Kaleshwaram Project-CBI: సీబీఐ డైరెక్టర్‌కి అస్వస్థత.. హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స..

తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ విచారణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న వేళ ప్రవీణ్ సూద్ పర్యటన జరగడం గమనార్హం. ప్రవీణ్ సూద్ శనివారం హైదరాబాద్‌లో దక్షిణ రాష్ట్రాల సంయుక్త డైరెక్టర్ల సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉంది.

Kaleshwaram Project-CBI: సీబీఐ డైరెక్టర్‌కి అస్వస్థత.. హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స..

CBI Director Praveen Sood

Updated On : September 6, 2025 / 3:05 PM IST

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రవీణ్ సూద్ శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఆయన ఆసుపత్రిలో చేరారు.

ప్రవీణ్ సూద్ వ్యక్తిగత పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చి సీబీఐ నగర యూనిట్ అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లి దైవదర్శనం చేసుకుని, తిరుగు ప్రయాణంలో ఉండగా అనారోగ్యానికి గురయ్యారు.

తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ విచారణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న వేళ ప్రవీణ్ సూద్ పర్యటన జరగడం గమనార్హం. ప్రవీణ్ సూద్ శనివారం హైదరాబాద్‌లో దక్షిణ రాష్ట్రాల సంయుక్త డైరెక్టర్ల సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉంది.

Also Read: కొత్త స్మార్ట్‌‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ నెలలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లు మాత్రం హైలెట్..!

కాళేశ్వరం కేసు తాజా పరిణామాలపై ఆయన సమీక్షించే అవకాశం కూడా ఉందని ముందుగా భావించారు. ఈ సమావేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.30 గంటల వరకు జరగాల్సి ఉంది.

సీబీఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, ఎన్‌డీఎస్‌ఏ నివేదిక, రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్మెంట్ నివేదికలు, తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో ఎఫ్ఐఆర్‌లు, రిమాండ్ నివేదికలు, ఇతర పత్రాలను సేకరించింది.

ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సోమవారం తెల్లవారుజామున చేసిన ప్రకటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సీబీఐ విచారణకు అంగీకారం తెలిపింది.

కేసీఆర్, హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. తదుపరి వాదనలు జరిగే వరకు వారిపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.