Gulzar House Fire Accident: పాపం… ఆ మెట్ల గేటు తాళం తీసి ఉంటే 17 ప్రాణాలు మిగిలేవి..!
కింద మెట్ల పక్కన భారీ ఎత్తున మంటలు రావడంతో సెకండ్ ఫ్లోర్ కు ఆ కుటుంబ సభ్యులు వెళ్లారు. అక్కడే ఉండిపోయారు.

హైదరాబాద్లోని పాతబస్తీలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది. అగ్ని ప్రమాద కారణాలను ఫైర్, పోలీస్ సిబ్బంది విశ్లేషిస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరగడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం… మూడంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో పాటు షార్ట్ సర్కూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు అంటుకోవడంతో పై ఫ్లోర్లలో ఉన్న ఓ కుటుంబం బయటికి వెళ్లేందుకు ప్రయత్నించింది.
మెట్ల పక్కనే ఒక్కసారిగా మంటలు వస్తూ ఉండడంతో బయటికి వెళ్లలేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. మంటల ధాటికి తట్టుకోలేక టెర్రస్ మీదకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, అంతకుముందు రోజులాగే టెర్రస్ పైన ఉన్న కార్మికులు మెట్ల ద్వారానికి తాళం వేశారు. దీంతో టెర్రస్ మీదకు ఆ కుటుంబ సభ్యులు వెళ్లలేకపోయారు.
తాళం వేసి ఉండటంతో కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒకసారిగా కిందికి వచ్చారు. కింద మెట్ల పక్కన భారీ ఎత్తున మంటలు రావడంతో సెకండ్ ఫ్లోర్ కు ఆ కుటుంబ సభ్యులు వెళ్లారు. అక్కడే ఉండిపోయారు. అదే సమయంలో.. మంటలు, పొగలు చూసి ఫైర్ డిపార్ట్మెంట్కు స్థానికులు సమాచారం అందించారు. ఫైర్ డిపార్ట్మెంట్కు కాల్ వెళ్లిన రెండు నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చారు.
చిన్న మెట్ల ద్వారం గుండా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. టన్నెల్ లాంటి మెట్లు ఉండడంతో ఇబ్బంది పడ్డారు. మెట్ల వద్ద వస్తున్న ఫైర్ ని వెంటనే ఫైర్ సిబ్బంది ఆపేశారు. మెట్ల నుంచి లోపలికి వెళ్లి కొందరిని కాపాడారు. 17 మంది అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు. 17 మందిని వివిధ ఆసుపత్రికి తరలించారు.