Medico Preethi Passed Away : మెడికో ప్రీతి కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్గ్రేషియా, దోషులను వదిలిపెట్టం- మంత్రి ఎర్రబెల్లి
మెడికో ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటన విడుదల చేశారు. ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- Naveen
- Published On : February 26, 2023 / 10:57 PM IST
Medico Preethi Passed Away : మెడికో ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటన విడుదల చేశారు. ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ప్రీతి మృతి పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన, విచారం వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు.(Medico Preethi Passed Away)
5 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం మృతిచెందింది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి నిమ్స్లో చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం రాత్రి 9.16 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్టు నిమ్స్ డాక్టర్లు ప్రకటించారు.
కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య(అనస్థీషియా) ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని ప్రీతిని.. సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ కొన్నాళ్లుగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ టార్చర్ తాళలేక ఆమె హానికరమైన ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి.. తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు.(Medico Preethi Passed Away)
మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. నిమ్స్ లో ప్రత్యేక వైద్య బృందం ప్రీతికి చికిత్స అందించింది. ప్రీతి ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్ డాక్టర్ల బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మృత్యువుతో పోరాడిన ప్రీతి కన్నుమూసింది.
అసలేం జరిగింది?
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి.. కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో పీజీ (అనస్థీషియా) మెడికల్ ఫస్టియర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు.
ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో విధులు నిర్వహిస్తుండగా ప్రీతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని డాక్టర్లు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పని చేస్తున్న డాక్టర్ ప్రీతి.. అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.
