Hydrabad Metro: రేపు రాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు.. మద్యం సేవించి మెట్రో ఎక్కొద్దు..
డిసెంబర్ 31 అర్థరాత్రి ఒంటి గంట వరకు ఆయా మార్గాల్లో రైళ్లు నడపనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చివరి రైలు ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటి గంటకు ప్రారంభమై చివరి స్టేషన్ కు 2గంటలకు చేరుకుంటుందని తెలిపారు. మెట్రోలో ప్రయాణించేవారు మద్యం సేవించకూడదని సూచించారు.
![Hydrabad Metro: రేపు రాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు.. మద్యం సేవించి మెట్రో ఎక్కొద్దు.. Hydrabad Metro: రేపు రాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు.. మద్యం సేవించి మెట్రో ఎక్కొద్దు..](https://10tv.in/wp-content/uploads/2022/12/Hydrabad-metro-1.jpg)
Hydrabad metro
Hydrabad Metro: మరికొద్ది గంటల్లో 2022 సంవత్సరం ముగియనుంది. 2023 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. న్యూఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ఇప్పటికే ఆయా ప్రాంతాలను ఎంచుకున్నారు. భాగ్యనగరంలోనూ రేపు సాయంత్రం న్యూ ఇయర్ వేడుకల సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి. 2023 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
న్యూ ఇయర్ వేడుకలు శనివారం రాత్రి 1గంట వరకు నిర్వహిస్తారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇప్పటికే నగర వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఓ ప్రణాళికతో ట్రాఫిక్ పోలీసులు ముందుకెళ్తున్నారు. కాగా, న్యూ ఇయర్ వేడుకల అనంతరం ప్రజలు తమతమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు వీలుగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల వేళలు పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
డిసెంబర్ 31 అర్థరాత్రి ఒంటి గంట వరకు ఆయా మార్గాల్లో రైళ్లు నడపనున్నట్లు తెలిపారు. చివరి రైలు ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటి గంటకు ప్రారంభమై చివరి స్టేషన్ కు 2గంటలకు చేరుకుంటుందని తెలిపారు. మెట్రోలో ప్రయాణించేవారు మద్యం సేవించకూడదని ఆయన తెలిపారు. రాత్రివేళల్లో మెట్రో సిబ్బంది, పోలీసులకు సహకరించాలని, అన్ని స్టేషన్లు, రైళ్లలో నిఘా ఉంచుతామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.